ఐదు పడకల భవనంలోకి సిఎం అరవింద్ కేజ్రివాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్ ఎట్టకేలకు ఇల్లు మారేందుకు అంగీకరించారు. ఇంతకుముందు ఢిల్లీ చీఫ్ సెక్రటరీ డిఎం సపోలియా ప్రతిపాదించిన భవనాన్ని కేజ్రివాల్ తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతంలో ఢిల్లీలోని భగవాన్ దాస్ రోడ్లోని 5 పడకల గదులున్న నూతన డుప్లెక్స్ ఇంటిలోకి మారేందుకు కేజ్రివాల్ అంగీకారం తెలిపారు.
ముఖ్యమంత్రులకు కేటాయించిన నివాస భవనాలతో పోల్చితే ప్రస్తుతం అరవింద్ కేజ్రివాల్కు కేటాయించిన ఐదు పడకల భవనం కొంత నిరాడంబరంగా ఉంది. అయితే సామాన్యునిలానే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా ఉంటానని చెప్పిన అరవింద్ కేజ్రివాల్, ఇప్పుడు నూతన ఐదు పడకల భవనంలోకి మారడంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యే అవకాశాలూ లేకపోలేదు.

కేజ్రివాల్కు కేటాయించిన నివాస భవనం 6వేల చదరపు అడుగులు విస్తీర్ణం కలిగి ఉంది. పచ్చిక ప్రాంతాన్ని కూడా కలుపుకున్నట్లయితే 9వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంటుంది. కాగా ఇప్పటి వరకు గజియాబాద్లోని కౌశాంబిలోని ఇండియన్ రెవెన్యూ సర్వీస్కు సంబంధించిన మూడు పడక గదుల అపార్ట్ మెంటులో కేజ్రివాల్ తన కుటుంబ సభ్యులతోపాటు నివాసం ఉన్నారు.
కాగా నూతనంగా కేటాయించిన నివాస భవనాన్ని ముఖ్యమంత్రి కార్యాలయంగా వినియోగించుకుంటారని కొందరు చెబుతుండగా, మరికొందరు నివాస భవనంగానూ ఉపయోగించుకుంటారని పేర్కొంటున్నారు. ఇది ఇలా ఉండగా మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్కు లుట్యాన్స్ బంగ్లా జోన్ ప్రాంతంలోని సెంట్రల్ పూల్లో ఓ పెద్ద భవనాన్ని కేటాయించారు. ఇతర మాజీ ముఖ్యమంత్రులు శ్యామ్ నాథ్ మార్గ్లోని భవనాల్లో నివాసం ఉంటున్నారు.












Click it and Unblock the Notifications