ఎన్నికల తర్వాత మీరు మళ్లీ చంద్రబాబుతో కలవరా, కలిస్తే ఇలాగా: బీజేపీపై శివసేన నిప్పులు
ముంబై: రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేసిన ఒక్కరోజు దీక్షకు పలువురు విపక్షాల నేతలు మద్దతు తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్ వంటి నేతలు అండగా నిలిచారు. అలాగే, బీజేపీ పట్ల అసంతృప్తితో ఉన్న మిత్రపక్షం శివసేన కూడా మద్దతిచ్చింది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఈ దీక్షలో పాల్గొన్నారు. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. దీనిపై శివసేన తిరిగి కౌంటర్ ఇచ్చింది.

చంద్రబాబు మద్దతు కోరరని గ్యారెంటీ ఏమిటి?
ఈ మేరకు శివసేన పత్రిక సామ్నాలో కథనం ప్రచురించింది. మర్యాద పూర్వకంగానే తాము చంద్రబాబు దీక్షా సభకు హాజరయ్యామని తెలిపింది. ఇదే సమయంలో బీజేపీపై శివసేన మండిపడింది. మిత్రపక్షాలతో సరైన విధంగా వ్యవహరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం అవసరమైన సీట్లు రాకుంటే బీజేపీ తిరిగి చంద్రబాబు మద్దతును కోరదనే గ్యారంటీ ఏమిటని ప్రశ్నించింది.

చంద్రబాబుకు సంఘీభావం తెలిపితే ఆకాశం ఊడిపడినట్లు
వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకు తక్కువ సీట్లు వస్తే చంద్రబాబు తలుపును బీజేపీ సీనియర్లు కొట్టరనే నమ్మకం ఏముందని శివసేన ప్రశ్నించింది. ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయిందని, ఆ రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. రాష్ట్రాల విభజనకు తాము వ్యతిరేకమని చెప్పింది. చంద్రబాబుకు తాము సంఘీభావం తెలిపితే ఏదో ఆకాశం వచ్చి కేంద్ర ప్రభుత్వంపై పడినట్టు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహించింది. ఎన్డీయేతో కలిసి ఉన్నంత కాలం చంద్రబాబును గొప్ప నేతగా బీజేపీ నేతలు కొనియాడారని పేర్కొంది. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన హఠాత్తుగా ఆయన అంటరానివాడయ్యాడా అని ప్రశ్నించింది. టీడీపీ అధినేతను మర్యాదపూర్వకంగా కలవడాన్ని విమర్శించడం ఏమిటని నిలదీసింది.

టీడీపీ, పీడీపీ మధ్య తేడా మాకు తెలుసు
పార్లమెంట్పై దాడి చేసిన అఫ్టల్ గురు, జేకేఎల్ఎఫ్ వ్యవస్థాపకుడు మక్బూల్ భట్ల మృత అవశేషాలను తెప్పించాలని జమ్ము కాశ్మీర్లోని మెహబూబా ముఫ్తీ పార్టీ (పీడీపీ)కి చెందిన రాజ్యసభ సభ్యుడు ఫయాజ్ అహ్మద్ డిమాండ్ చేస్తున్నారని, కానీ మొన్నటి వరకు ఆ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుందని శివసేన మండిపడింది. బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్న సమయంలో కాశ్మీర్లో నెత్తుటి ఏర్లు పారాయని చెప్పిందని, కానీ ఎన్నో దాడులు జరిగాయని, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నవారికి కూడా రివార్డులు దక్కాయని దుయ్యబట్టింది. దీనిపై ఎవరికీ ఎలాంటి సమస్య లేదని, చంద్రబాబు వద్దకు వెళ్లినందుకు మాత్రం తమను తీవ్రంగా విమర్శిస్తున్నారని మండిపడింది. పీడీపీ, టీడీపీలకు మధ్య ఉన్న తేడా ఏమిటో తమకు స్పష్టంగా తెలుసని చెప్పింది.












Click it and Unblock the Notifications