మోడీ నోట రాజీవ్ మాట: ఆవేదన, నవ్వులు పూయించారు
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎలా నడవాలనే అంశాన్ని రాష్ట్రపతి స్పష్టంగా చెప్పారని, రాష్ట్రపతి సూచనలు పాటించడం మనందరి బాధ్యత అని ప్రధాన నరేంద్రమోడీ అన్నారు. ఢిల్లీలోని జెఎన్యూ వివాదం, హెచ్సీయూ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య తదనంతర పరిణామాలపై రాహుల్ గాంధీపై మంగళవారం అధికార పక్షం విరుచుకుపడింది.
నల్లధనం వెలికితీస్తామని చెప్పుకుని గద్దెనెక్కిన ప్రధాని మోడీ.. ఆ తర్వాత నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే 'ఫెయిర్ అండ్ లవ్లీ' మంత్రాన్ని పఠిస్తున్నారని బుధవారం రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లో భాగంగా గురువారం ప్రధాని మోడీ మాట్లాడారు.

ఆయన లోక్సభలో మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించే వేదికగా పార్లమెంట్ ఉండాలని అన్నారు. ప్రతి ఎంపీ సభలో తన అభిప్రాయం చెప్పేవిధంగా ఉండాలని అన్నారు. దీంతో పాటు సభలో బిల్లులు త్వరగా పాసయ్యేందుకు సభ్యులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్క సభ్యుడూ సభా మర్యాదలను పాటించాలని కోరారు.
మోడీ సభలో మాట్లాడుతుండగా బీజేపీ సభ్యులు బల్లలు చరుస్తూ ఆయన ప్రసంగానికి మద్దతు తెలిపారు. మోడీ మాట్లాడుతున్నంత సేపు సభలో నవ్వులు పూయించారు. పార్లమెంట్ సజావుగా జరగకపోతే ప్రజల సమస్యలపై చర్చించేందుకు ఆస్కారం ఉండదని అన్నారు. సభా సమయాన్ని వృథా చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే వచ్చే సమస్యలపై అప్పటి స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ వ్యాఖ్యానాన్ని ఈ సందర్భంగా ప్రధాని ఉటంకించారు.
దీంతోపాటు సభా మర్యాదలు కాపాడటంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వ్యాఖ్యలను మోడీ ప్రస్తావించారు. పార్లమెంటు సభ్యుడిగా ప్రతి ఎంపీపై గురుతర బాధ్యత ఉంటుందని రాజీవ్ గాంధీ చెప్పారని మోడీ అన్నారు. ప్రజలు మనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించామా? లేదా? అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలని కూడా రాజీవ్ చెప్పారని మోడీ గుర్తు చేశారు.
మన విద్యావిధానం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోందని అన్నారు. పార్లమెంట్లో జరుగుతున్న గందరగోళంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని చెప్పారు. ప్రధానిగా కాకుండా, సభలో ఓ సభ్యుడిగా నా అభిప్రాయాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నా అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ పార్లమెంట్ ముందు మూడు ప్రతిపాదనలు ఉంచారు.
1. మహిళా దినోత్సవం నాడు కేవలం మహిళా సభ్యులకే మాట్లాడే అవకాశం
2. తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టిన ఎంపీలకు వారంలో ఒకరోజు మాట్లాడే అవకాశం
3. ప్రతి ఎంపీ తన భావాలను సభకు చెప్పుకునే అవకాసం, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ సలహాలు ఇవ్వడం
అనంతరం పార్లమెంట్లో కాంగ్రెస్ వైఖరిపై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన జీఎస్టీ బిల్లును ఆ పార్టీ ఎంపీలే తిరస్కరించడం తనకు అర్ధం కాలేదని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications