ఎన్ఆర్సీ జాబితా తారుమారు, రీ వెరిఫై చేయండి, అసోం మంత్రి హిమంత బిశ్వ శర్మ కన్నీరు ...
గువహతి : అసోంలో జాతీయ పౌర రిజిష్టర్ తుది జాబితా విడుదలతో ఆ రాష్ట్ర మంత్రి కన్నీరు పెట్టుకున్నారు. తుది జాబితాను మరోసారి పున: పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అసోంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి హిమంత బిశ్వ శర్మ .. కంట కన్నీరు పెట్టుకోవడం చర్చానీయాంశమైంది. దాదాపు 19 లక్షల పైచిలుకు మంది పేర్లు జాబితాలో లేకపోవడంతో ఆయన ఉద్వేగానికి గురయ్యారు. 19 లక్షల మందికి సంబంధించిన జాబితాను రీ వెరిఫై చేయాలని కోరారు.
అటు ఇటు ...
ఎన్ఆర్సీ జాబితా తారుమారు చేసి ఉంటారని కూడా అనుమానం వ్యక్తం చేశారు హిమంత బిశ్వ శర్మ. 1971లో బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు శరణార్థులుగా వచ్చిన వారు ఎన్ఆర్సీ జాబితాలో లేరని పేర్కొన్నారు. వారు సమర్పించిన శరణార్థి ధ్రువపత్రాన్ని అధికారులు తీసుకోలేదని గుర్తుచేశారు. ఎన్ఆర్సీ జాబితాకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి పరిశీలించాలని కోరారు. దీంతో 20 శాతం సరిహద్దు జిల్లాలు, 10 శాతం మిగిలిన జిల్లాలకు సంబంధించి కచ్చితమైన సమాచారం వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ విధంగా పరిశీలించాలని ఇదివరకు సుప్రీంకోర్టు స్పస్టంచేసిందని .. హిమంత బిశ్వ ట్వీట్ చేశారు.
నమ్మకం లేదు .. కానీ ...
ఎన్ఆర్సీ జాబితాపై తనకు నమ్మకం లేదని ఇవాళ ఉదయయే మీడియాతో మాట్లాడారు బిశ్వ. అనుకొన్నట్టుగానే 19 లక్షలకు పైగా మంది ఉండటంతో ఆందోళనకు గురయ్యారు. అయితే ఇది తుది జాబితా కాబోదని .. మళ్లీ నిర్వహించే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఇంత పెద్దమొత్తంలో ఉండటంతో ఉద్వేగానికి గురయ్యారు. కంట కన్నీరు పెట్టారు. మరోవైపు మాజీ సీఎం తరుణ్ గొగొయ్, గౌరవ్ గొగొయ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీ జాబితా ..
జాతీయ పౌర రిజిస్టర్ తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. మొత్తం 3 కోట్ల 11 లక్షల 21 వేల 4 మంది జాబితాలో ఉన్నట్టు పేర్కొన్నారు. 19 లక్షల 6 వేల 657 మంది పేర్లు తుది జాబితాలో లేవని వెల్లడించారు. తాము కోరిన ధ్రువపత్రాలను సమర్పించలేనందున .. వారిని ఫైనల్ లిస్ట్ నుంచి తొలగిస్తున్నట్టు ఎన్ఆర్సీ వర్గాలు ప్రటకించాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ పౌరసత్వ రిజిస్టర్ జాబితాలో లేని పేర్లను ఆన్లైన్లో ఉంచారు. ఇందులో 19.06 లక్షల మందిని విదేశీయులని తేల్చారు. దీంతో అసోంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుందనే ఊహగానాలతో అక్కడ భారీగా భద్రతా బలగాలను మొహరించారు. గువహతిలోని సచివాలయం, అసెంబ్లీ ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.