కాంగ్రెస్ వలస నేతకు పీఠం: ఆ రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రిగా అనూహ్య పేరు: సిట్టింగ్ సీఎంకు నో ఛాన్స్
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ.. రెండు చోట్ల మినహా మిగిలిన రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కరోనా వైరస్ సంక్షోభాన్ని సృష్టించిన ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని నివారించడంపై దృష్టి సారించారు. ఎన్నికల ప్రక్రియ వల్ల రెండు నెలల పాటు కుంటుపడిన పాలనను గాడిలో పెడుతున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కేరళ, అస్సాంలల్లో ఇంకా ఆ పరిస్థితి రాలేదు. లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వ సారథిగా పినరయి విజయన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
అస్సాంలో మాటేంటీ?
అస్సాంలో ప్రభుత్వం ఏర్పాటులో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఎన్నికల ఫలితాలు వెలువడి ఆదివారం నాటికి వారం రోజులవుతోంది. ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాలేదక్కడ. హంగ్ అసెంబ్లీ లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంపూర్ణ మెజారిటీ బీజేపీకి ఉంది. 126 స్థానాలు ఉన్న అస్సాం అసెంబ్లీలో బీజేపీకి 74 సీట్లు దక్కాయి. అయినప్పటికీ- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ అధిష్ఠానం జాప్యం చేస్తోంది. దీనికి కారణం- ముఖ్యమంత్రి శర్బానంద సొనొవాల్పై రాష్ట్రస్థాయి బీజేపీ నేతల్లో అసంతృప్తి వ్యక్తం కావడమే.
ఢిల్లీకి చేరిన పంచాయితీ..
శర్బానంద సొనొవాల్కు వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి బీజేపీ నాయకులు ఎంత మాత్రమూ అంగీకరించట్లేదు. ఆయనకు బదులుగా మంత్రి హిమంత బిశ్వశర్మను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ విషయంలో అస్సాం బీజేపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. వైద్య, ఆరోగ్యం, ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ వర్గీయులు..సొనొవాల్ను ముఖ్యమంత్రిగా అంగీకరించలేకపోతోన్నారు. తమ నాయకుడు హిమంతకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నారు. ఈ పంచాయతీ కాస్తా హస్తినకు చేరింది. ఆ ఇద్దరు నేతలు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు.
హిమంత వైపే మొగ్గు..
శనివారం ఉదయం గువాహటి నుంచి ఢిల్లీకి చేరిన శర్బానంద సొనొవాల్, హిమంత బిశ్వ శర్మ.. పార్టీ అధిష్ఠానంతో భేటీ అయ్యారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, జాతీయ ప్రధాన కార్యదర్శులు బీఎల్ సంతోష్, అరుణ్ సింగ్లను పలుమార్లు కలిశారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరు నేతల పనితీరుపై బీజేపీ అగ్ర నేతలు దృష్టి సారించారు. ముఖ్యమంత్రి సొనొవాల్, ఆర్థిక, ఆరోగ్య మంత్రిగా హిమంత పనితీరు గురించి నివేదికలను తెప్పించుకున్నారు. ఈ సందర్భంగా మెజారిటీ నేతలు హిమంత వైపే మొగ్గు చూపారని తెలుస్తోంది.
సాయంత్రానికి అధికారిక ప్రకటన
అస్సాం ముఖ్యమంత్రి పేరు నెలకొన్న ప్రతిష్ఠంభన ఈ సాయంత్రానికి తొలగిపోయే అవకాశం ఉందని పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఫలితాలు వెలువడి వారం రోజుల కావడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంపూర్ణ మెజారిటీ ఉండటం వల్ల జాప్యం చేయకూడదని అగ్ర నాయకులు భావిస్తున్నారు. మెజారిటీ నేతల అభిప్రాయం మేరకు ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ పేరును ఖాయం చేస్తారని తెలుస్తోంది.
కాంగ్రెస్ నుంచి బీజేపీకి..
హిమంత బిశ్వ శర్మ.. నిజానికి బీజేపీ నాయకుడు కాదు. ఆయన కాంగ్రెస్ నాయకుడు. సుదీర్ఘకాలం పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2015లో పార్టీ ఫిరాయించారు. బీజేపీలో తీర్థాన్ని పుచ్చుకున్నారు. 2016 నాటి ఎన్నికల్లో పోటీ చేశారు. ఘన విజయాన్ని అందుకున్నారు. సొనొవాల్ కేబినెట్లో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సమర్థుడైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడదే ఆయనకు ప్లస్ పాయింట్గా మారింది. హిమంత వంటి నాయకుడి అండ సొనొవాల్కు లేకపోయి ఉంటే ఫలితాలు వేరుగా ఉండేవంటూ ఆయన వర్గీయులు కుండబద్దలు కొడుతున్నారు.