50 ఏళ్ల సమస్యకు పరిష్కారం: అమిత్ షా సమక్షంలో ఒప్పందంపై అసోం-మేఘాలయ సంతకం
న్యూఢిల్లీ: అస్సాం, మేఘాలయ మధ్య అర శతాబ్ధం నుంచి కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం లభించింది. అస్సాం, మేఘాలయ మధ్య దీర్ఘకాలంగా ఉద్రిక్తతలు సృష్టిస్తున్న సరిహద్దు వివాదానికి పరిష్కారం కోసం జరిగిన చారిత్రక ఒప్పందంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా సంతకాలు చేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో.. ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో ఈ ఒప్పందం జరిగింది. ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శలు, ఇతర అధికారులు కూడా సీఎంల వెంట ఢిల్లీ వెళ్లారు. హోం శాఖ పరిశీలన, ఆమోదం కోసం ముసాయిదా తీర్మానం సమర్పించిన రెండు నెలల అనంతరం.. ఇప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. జనవరి 31న ఇరు రాష్ట్రాల సీఎంలు.. అమిత్ షాకు ముసాయిదా తీర్మానం అందించారు.
కాగా, అసోం, మేఘాలయ 884 కి.మీ. మేర సరిహద్దును పంచుకుంటున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య 12 వివాదాస్పద ప్రాంతాల్లో.. తొలుత ఆరు సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ముసాయిదా తీర్మానాన్ని రూపొందించాయి. దీని ప్రకారం.. వివాదంగా ఉన్న 36.79 చదరపు కి.మీ. భూభాగంలో 18.51 చదరపు కి.మీ. అసోం వద్ద ఉండనుండగా.. మిగతా 18.28 చదరపు కి.మీ. మేఘాలయకు చెందేలా అంగీకారం కుదిరింది.
1972లో అసోం నుంచి మేఘాలయ విడిపోయిన సమయంలో తొలిసారి ఈ దీర్ఘకాలిక వివాదం సమస్య ఉత్పన్నమైంది. దీనిపై గత ఆగస్టులో రెండు రాష్ట్రాలు వేర్వేరుగా 3 కమిటీల చొప్పున నియమించాయి. పరిష్కారం దిశగా.. రెండు విడతలుగా చర్చలు కూడా జరిగాయి.
మేఘాలయ సీఎం సంగ్మా. సరిహద్దు సమస్యను వీలైనంత తొందరంగా పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. వివాదం పరిష్కారం కోసం తగిన సూచనలు చేస్తూ, చొరవ చూపిన అమిత్ షా కు కృతజ్ఞతలు తెలిపారు. అసోం సీఎం బిశ్వశర్మ కూడా బాగా చురుగ్గా వ్యవహరించారని తెలిపారు. మరో 6-7 నెలల్లో మిగతా వివాదాస్పద ప్రాంతాల సమస్యను కూడా పరిష్కరించుకునే దిశగా చర్యలు ప్రారంభిస్తామని హిమంత బిశ్వ శర్మ చెప్పారు.
కాగా, ఈశాన్య రాష్ట్ర ప్రజలకు ఇదో చారిత్రక రోజు అని అభివర్ణించారు అమిత్ షా. ఈ ఒప్పందంతో.. ఇరు దేశాల మధ్య 70 శాతం సరిహద్దు వివాదం పరిష్కారం అయిందని అన్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన కమిటీ సభ్యులు, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.