మనోహరీ.. ఇది చాలా కాస్లీ గురూ..
గౌహతి : ఛాయ్.. ఈ పేరు వినగానే చాలా మందికి ప్రాణం లేచివస్తుంది. తిండిలేకపోయినా పర్వాలేదు.. టీ ఉంటే చాలు అనే వారు చాలా మంది ఉంటారు. రకరకాల టీలు టేస్ట్ చేస్తూ జిహ్వ చాపల్యాన్ని తీర్చుకుంటుంటారు. అందుకోసం ఎంత మొత్తం చెల్లించేందుకైనా సిద్ధమవుతారు. దేశంలో టీ పొడి ఉత్పత్తికి పేరు గాంచిన అసోంలో అలాంటి వారి కోసం పండించిన అత్యంత అరుదైన టీ పొడిని వేలం వేయగా రికార్డు ధర పలికింది.
కిలో ధర రూ.50వేలు
గౌహతి టీ ఆక్షన్ సెంటర్లో నిర్వహించిన వేలంలో అసోంకి చెందిన అరుదైన రకం టీ పొడి కిలో అక్షరాలా రూ.50,000 పలికింది. అక్కడ ఉన్న అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కిలో టీ పొడి ఇంత భారీ మొత్తం పలకడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. ఇంతకీ ఆ టీ పొడి పేరు ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారు. మే - జూన్ నెల్లో మాత్రమే అసోంలో దొరికే ఆ చాయ్ పత్తి పేరు మనోహరి గోల్డ్. దిబ్రూగఢ్లోని టీ ఎస్టేట్లో దీన్ని పండించారు. ఆకులను కాకుండా మొగ్గలను మాత్రమే ఈ టీ పొడి తయారీకి ఉపయోగిస్తారు.
గతంలోనూ రికార్డు
గతేడాది నిర్వహించిన వేలంలో కిలో మనోహరి గోల్డ్ ధర రూ. 39,001 పలికి రికార్డు సృష్టించింది. అయితే అరుణాచల్ ప్రదేశ్లోని దోన్యీ పోలో టీ ఎస్టేట్లో పండించిన గోల్డెన్ నీడిల్ వెరైటీ కిలో రూ.40వేలు పలికి ఆ రికార్డును బద్దలు కొట్టింది. తాజాగా మనోహరి గోల్డ్ ఆ రికార్డును మళ్లీ ఖాతాలో వేసుకుంది. వేలంలో టీ పొడి రూ.50వేలు పలకడంపై గౌహతి టీ ఆక్షన్ బయ్యర్స్ అసోసియేషన్ సెక్రటరీ దినేష్ బిహానీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
రిటైల్ మార్కెట్లో 100గ్రా. రూ.8వేలు
సౌరభ్ టీ ట్రేడర్స్ ఓనర్ మంజీలాల్ మహేశ్వరి వేలంలో ఈ టీ పొడిని దక్కించుకున్నారు. ఆయన 2018లో 2 కేజీల మనోహరి గోల్డ్ను టీ పొడి కొన్నారు. ఓ కస్టమర్లకు అది తెగ నచ్చేయడంతో ఆయన కోరిక మేరకు మళ్లీ కొనుగోలు చేసినట్లు చెప్పారు. గతంలో తాను కొన్న మనోహరి గోల్డ్ టీ పొడిని 100 గ్రాములను రూ.8వేలకు అమ్మినట్లు చెప్పారు. తమ తోటలో పండించిన టీ పొడి భారీ రేటు పలకడంపై మనోహరి టీ ఎస్టేట్ ఓనర్ రాజన్ లోహియా సంతోషం వ్యక్తంచేశారు. ఈ ఏడాది ప్రతికూల వాతావరణం కారణంగా కేవలం ఐదు కిలోల తేయాకు మాత్రమే చేతికి వచ్చిందని చెప్పారు.