అసోం సంచలనం: ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగానికి 'నో'
ఒక్క ఉద్యోగాల విషయంలో మాత్రమే గాక ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలకు కూడా ఈ కొత్త నిబంధన వర్తించనుంది.
దిస్పూర్: ముస్లిం జనాభాను నియంత్రించాలని చేశారో లేక నిజంగా ప్రజా సంక్షేమం కోరి చేశారో తెలియదు గానీ మొత్తానికి అసోం రాష్ట్ర ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో చైనా అనుసరించిన జనాభా పాలసీని తలపించేలా.. అసోం ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చింది.
ఈ పాలసీ మేరకు ఇకనుంచి ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్న దంపతులు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు. అంతేకాదు, మైనారిటీ తీరకుండానే వివాహం చేసుకునేవారు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఆదివాం నాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారి సంక్షేమం, మాతా శిశుమరణాలను అరికట్టాలన్న ఉద్దేశంతోనే ఈ కొత్త పాలసీని రూపొందించినట్లుగా హిమంత బిశ్వ శర్మ తెలిపారు.అయితే అసోం బీజేపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో బెంగాలీ ముస్లింల జనాభాను నియంత్రించేందుకే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
ఒక్క ఉద్యోగాల విషయంలో మాత్రమే గాక ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలకు కూడా ఈ కొత్త నిబంధన వర్తించనుంది. రాష్ట్రంలో సబ్సిడీ కింద ఇస్తున్న ట్రాక్టర్లు, ఇళ్ల పంపిణీ వంటి పథకాలకు ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న దంపతులు అనర్హులవుతారు. నిబంధన ప్రకారం స్థానిక సంస్ఘలు, మున్సిపల్ ఎన్నికల్లోను వారికి అవకాశం ఉండదు.
కాగా, అసోం ప్రస్తుత జనాభా 3.12కోట్లు కాగా, 2011తో పోల్చితే 1కోటి జనాభా పెరిగినట్లు తెలుస్తోంది.
ఇక మహిళా రిజర్వేషన్ల గురించి ప్రస్తావిస్తూ.. రాబోయే రోజుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ వర్తింపజేసే ప్రతిపాదనను పరిశీలిస్తామని మంత్రి చెప్పారు. దీనిపై అప్పుడే తొందర పడబోమని, ఒక్కో అడుగు ముందుకు వెళ్తామని చెప్పారు. జూలై వరకు ప్రజల నుంచి సలహాలు-సూచనలు స్వీకరించి, ఆ తర్వాత దీన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టే అవకాశం ఉందన్నారు.












Click it and Unblock the Notifications