అసోం వీరప్పన్ మంగిన్ ఖల్హౌ హతం... సొంత గ్రూప్లో విభేదాలు... చంపింది వారే...
అసోం వీరప్పన్గా పేరుగాంచిన యునైటెడ్ పీపుల్స్ రివల్యూషనరీ ఫ్రంట్ (UPRF) చీఫ్ కమాండర్ మంగిన్ ఖల్హౌ హతమయ్యాడు. యూపీఆర్ఎఫ్ సభ్యులే మంగిన్ ఖల్హౌని హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. అంతర్గత విభేదాల కారణంగా యూపీఆర్ఎఫ్ సభ్యులు మంగిన్తో వాగ్వాదానికి దిగి బుల్లెట్ల వర్షం కురిపించినట్లు అక్కడి పోలీసులు చెబుతున్నారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం దిఫు ఆస్పత్రికి తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం... మంగిన్ ఖల్హౌ కలప స్మగ్లింగ్లో అసోం వీరప్పన్గా పేరుగాంచాడు. నిజానికి గడిచిన కొన్నేళ్లలో యూపీఆర్ఎఫ్ చాలావరకు బలహీనపడింది. కీలక నేతలు,సీనియర్లు ఆ గ్రూప్ నుంచి బయటకు వెళ్లిపోయారు. చాలామంది పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం మంగి ఖల్హౌ ఒక్కడే ఆ గ్రూపులో సీనియర్ సభ్యుడు.
కొంతకాలంగా గ్రూపులోని ఇతర సభ్యులకు,మంగిన్ ఖల్హౌకు మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో దిఫు జిల్లా కేంద్రానికి 56కి.మీ దూరంలో ఉన్న ఖెంగ్పిబంగ్ ప్రాంతంలో సొంత గ్రూపు సభ్యులకు,ఖల్హౌకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మంగిన్ ఖల్హౌపై వారు కాల్పులకు పాల్పడ్డారు. అతని తలలో బుల్లెట్లు కురిపించారు.దీంతో మంగిన్ ఖల్హౌ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్ట్ నిమిత్తం దిఫు ఆస్పత్రికి తరలించారు.
యూపీఆర్ఎఫ్లో దాదాపుగా కుకీ కమ్యూనిటీ నుంచి వచ్చినవారే ఉంటారు. ఈ గ్రూప్ సింగ్హసన్ పర్వతాలపై తమ స్థావరాల్ని ఏర్పరుచుకుంది. చైనా నుంచి మయన్మార్ ద్వారా ఆయుధాలను కొనుగోలు చేసే ఈ సంస్థ గతంలో పలుమార్లు భద్రతా దళాలపై కాల్పులకు పాల్పడింది. ఏడాది క్రితం ఈ గ్రూప్ చీఫ్ కమాండర్ గయిటె పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు.
Recommended Video
ఆ తర్వాత ఆ గ్రూప్ సభ్యులంతా లొంగిపోవాలని నిర్ణయించుకుని సీఎం శర్బానంద సోనోవాల్కి లేఖ కూడా రాశారు.కానీ కొన్ని కారణాలతో ఇప్పటివరకూ యూపీఆర్ఎఫ్ గ్రూప్ లొంగుబాటు జరగలేదు.అయితే గత ఏడాది కాలంలో చాలామంది గ్రూప్ సభ్యులు లొంగిపోయారు. తాజాగా మంగిన్ ఖల్హౌ హతమవడంతో ఆ పార్టీలో ఇక సీనియర్లు ఎవరూ లేకుండా పోయారు.