ఉద్యోగం ఇవ్వలేదని టీచర్ ఆత్మహత్య
గుహవాటి: ఉద్యోగం పర్మినెంట్ చెయ్యలేదని ఓ అసిస్టెంట్ టీచర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అసోంలోని మోరీగావ్ జిల్లాలో జరిగింది. మంగళవారం ఉదయం శ్యామ్ లాలా దాస్ ఆనే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు.
పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు కహిబరిలోని ఎమ్ఈ స్కూల్ లో శ్యామ్ లాల్ దాస్ గత 22 సంవత్సరాల నుంచి అసిస్టెంట్ టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం ఉదయం ఈయన ఇంటి సమీపంలోని ఓ చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించాడు.
విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని కిందకు దించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. శ్యామ్ లాల్ దాస్ గత 22 సంవత్సరాల నుంచి ఆ స్కూల్ లో జీతం తీసుకోలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు.
ఆ స్కూల్ ను అక్కడి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల జాబితాలోకి చేర్చింది. అయితే శ్యామ్ లాల్ దాస్ తన ఉద్యోగాన్ని పర్మినెంట్ చెయ్యలేదని ఆవేదన చెందాడు. మనస్తాపంతోనే శ్యామ్ లాల్ దాస్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
మోరీగావ్ జిల్లాలో ఇటీవలే ఓ టీచర్ ఇదే విధంగా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అన్నారు. జీతాలు సరిగా ఇవ్వడం లేదని గత సెప్టెంబర్ నెలలో కమల్ బార్డోలీ ఆత్మహత్య చేసుకున్నాడని స్థానిక టీచర్లు తెలిపారు.