మాజీ ప్రధాని వాజ్పేయికి భారతరత్న... డిసెంబర్ 25న ప్రకటించే అవకాశం
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్ బీహారీ వాజ్పేయికి దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను ప్రకటించేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈనెల 25న వాజ్పేయి 90వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ మేరకు స్వయంగా ప్రకటన చేయనున్నారని సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో విస్తృతంగా ప్రచారం సాగింది.
భారతీయ జనతా పార్టీ తరుపున తొలి ప్రధానిగా బాధ్యతలను స్వీకరించి... సచ్ఛీలత నిదర్శనంగా ఆయన పుట్టినరోజుని సుపరిపాలన దినంగా ఇప్పటికే కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అవినీతి రహిత పాలనను అందించిన వాజ్పేయికి భారతరత్న ఇవ్వాలని పార్టీ నేతలు మురళి మనోహర్ జోషి, హేమా మాలిని సహా పలువురు నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ విషయంలో మిత్రపక్షం శివసేన కూడా తన మద్దతు ప్రకటించింది. ఇటీవల భారతరత్న పురస్కారాల ప్రకటనలో యూపీఏపై నిప్పులు చెరిగిన బీజేపీ, వాజ్పేయి వారి కంటికి కనిపించలేదా అంటూ విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 25న అటల్ బీహారీ వాజ్పేయికి భారతరత్న పురస్కారం ఇవ్వనున్నట్లు ప్రకటన వెలువడనుంది.












Click it and Unblock the Notifications