బెంగళూరులో ఏటీఎం డబ్బు: రూ. 90 లక్షలతో పరారైన సిబ్బంది, గన్ మ్యాన్ కు చెప్పి!
బెంగళూరు: బెంగళూరు నగరంలో మరో సారి ఏటీఎంలో నగదు నిల్వచెయ్యడానికి బయలుదేరిన సిబ్బంది ఆ నగదుతో సహ పరారైన ఘటన జ్ఞానభారతీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రూ. 90 లక్షలతో సహ వాహనంతో పరారైన నిందితుల కోసం పొలీసులు గాలిస్తున్నారు.
మంగళవారం జ్ఞానభారతీ పోలీస్ స్టేషన్ సర్కిల్ సమీపంలో ఉన్న ఏటీఎంలో నగదు నిల్వచెయ్యడానికి సీఎంఎస్ సంస్థ సిబ్బంది వెళ్లారు. ఆ సమయంలో డ్రైవర్ నారాయణస్వామి, ఉద్యోగి నరసింహరాజు, గన్ మ్యాన్ అక్కడ ఉన్నారు. తరువాత గన్ మ్యాన్ ను పిలిచి అరటిపండ్లు తీసుకురావాలని చెప్పారు.
గన్ మ్యాన్ అరటి పండ్లు తీసుకు వచ్చి చూడగా వాహనంతో సహ నారాయణస్వామి, నరసింహరాజు మాయం అయ్యారని గుర్తించాడు. వాహనం కనపడకపోవడంతో గన్ మ్యాన్ సీఎంఎస్ సంస్థ సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఏటీఎం కేంద్రం పరిసర ప్రాంతాల్లోని సీసీకెమెరాలు పరిశీలించి రూ. 90 లక్షలతో సహ మాయం అయిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. బెంగళూరు నగరం నుంచి నగదు, వాహనం, నిందితులు బయటకు వెళ్లకుండా నాకాబంధి చేస్తున్నారు.