ఐదు రోజులు.. రెండో భర్తకు భార్య టార్చర్.. గోళ్లు పీకి,ఇనుపరాడ్లతో..
కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలోని కొల్లెగల్ తాలుకా ముదిగుండంలో దారుణం జరిగింది. ఓ వివాహిత మహిళ తన సోదరుడు, స్నేహితులతో కలిసి భర్తను కిడ్నాప్ చేయించి.. ఐదు రోజుల పాటు నరకం చూపించింది. తీవ్ర చిత్రహింసలకు గురైన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య పెట్టిన చిత్రహింసలే తన ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చాయని మరణానికి ముందు ఇచ్చిన వాంగ్మూలంలో అతను పేర్కొన్నాడు.
అసలేం జరిగింది
బెంగళూరుకు చెందిన రష్మి అనే మహిళ స్థానికంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. మొదటి భర్తతో విడాకులు తీసుకుని ముదిగుండంకు చెందిన సుబ్రహ్మణ్యంను రెండో పెళ్లి చేసుకుంది. ఏడాది పాటు ఇద్దరి కాపురం సాఫీగానే సాగింది. కానీ ఏడాది తర్వాత రష్మి తిరిగి తన మొదటి భర్త వద్దకు వెళ్లిపోవడంతో ఇద్దరి మధ్య శత్రుత్వం మొదలైంది.
డబ్బులు తిరిగివ్వాలని
రష్మి తనతో ఉన్న ఏడాది కాలంలో సుబ్రహ్మణ్యం ఆమె నుంచి రూ.50లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బులన్నీ క్రికెట్ బెట్టింగ్లో పెట్టి నష్టపోయాడు. మొదటి భర్తకు వెళ్లిపోయాక.. రష్మి తన డబ్బు తనకు తిరిగిచ్చేయాలని సుబ్రహ్మణ్యంను డిమాండ్ చేసింది. సుబ్రహ్మణ్యం డబ్బు తిరిగి ఇవ్వడానికి నిరాకరించడంతో తన సోదరుడు, స్నేహితులతో కలిసి అతన్ని కిడ్నాప్ చేయించింది.
కిడ్నాప్ చేసి టార్చర్..
సుబ్రహ్మణ్యంను కిడ్నాప్ చేసి దాదాపు ఐదు రోజుల పాటు అతనికి నరకం చూపించారు. ఐరన్ రాడ్లతో అతనిపై దాడి చేయడమే కాకుండా.. చేతి గోళ్లు కూడా తొలగించారు. ఐదు రోజుల తర్వాత సుబ్రహ్మణ్యంను తిరిగి అతని ఇంటి వద్ద పడేసి వెళ్లిపోయారు. అనంతరం సుబ్రహ్మణ్యం కొల్లెగల్ లోని ఓ ఆస్పత్రిలో చేరాడు. అక్కడినుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం మైసూరు తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి..
తీవ్ర గాయాలతో బాధపడుతూ మైసూరు ఆస్పత్రిలో అతను కన్నుమూశాడు. అంతకుముందు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో బాధితుడు తన భార్య,ఆమె సోదరుడు,స్నేహితులు పెట్టిన చిత్రహింసల గురించి వివరించాడు. దీంతో కొల్లెగల్ పోలీసులు రష్మి,అతని సోదరుడు,స్నేహితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.