లేడీస్ హాస్టల్ వద్ద సంచారంతో మహేష్తో గొడవ: ప్రతీకారంతో గౌతమి హత్య
బెంగళూరు: బెంగళూరు నగరంలోని కాడుగోడిలోని ప్రగతి కాలేజ్ పీయుసీ విద్యార్థిని గౌతమి (18)ని ప్రతీకారం తీర్చుకోవడానికి మహేష్ హత్య చేశాడని పోలీసు అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది. కాలేజ్ అటెండర్ మహేష్ అదే కాలేజ్ విద్యార్థినులు గౌతమి, శిరీషల మీద పగపెంచుకుని కాల్పులు జరిపాడు.
ఇందుకు సంబంధించి బుధవారం బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులోని సారాంశం ఈ విధంగా ఉంది - కాలేజ్ క్యాంపస్ లోని లేడిస్ హాస్టల్ పరిసర ప్రాంతాలలో అటెండర్ మహేష్ సంచరించేవాడు. అందుకు కాలేజ్ విద్యార్థినులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మార్చి 30వ తేది రాత్రి గొడవ
మార్చి 30వ తేదీన మహేష్ లేడిస్ హాస్టల్ దగ్గరకు వెళ్లి అటు ఇటు సంచరించాడు. దాన్ని గమనించిన గౌతమి, శిరీష మహేష్ ను నిలదీశారు. రాత్రిపూట ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నించారు. ఆ సమయంలో మహేష్ వారిద్దరితో గొడవపడ్డాడు.
హాస్టల్ లోని విద్యార్థులు బయటకు రావడంతో మహేష్ అక్కడి నుండి వెళ్లి పోయాడు. మరసటి రోజు మార్చి 31వ తేది మహేష్ హాస్టల్ లోకి వెళ్లి గౌతమి, శిరీష ఉన్న గది తలుపుకొట్టాడు. వారు తలుపు తీసిన సమయంలోనే పిస్తోల్ తో కాల్పులు జరిపాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. గౌతమి, శిరీషల మీద కక్ష పెంచుకుని అంతం చేశాడని ఎం.ఎన్. రెడ్డి తెలిపారు.
నిందితుడు మహేష్ బీహార్ లో రూ. 14 వేలు చెల్లించి పిస్తోల్ తీసుకువచ్చాడని పోలీసులు అంటున్నారు. అయితే అతను ఎప్పుడు పిస్తోల్ కునుగోలు చేశాడని కచ్చితంగా వెలుగు చూడలేదు. శివమొగ్గ జిల్లా అగుంబె ప్రాంతానికి చెందిన మహేష్ 2012 నుండి ప్రగతి కాలేజ్ లో అటెండర్ గా పని చేస్తున్నాడు.