తీర్పుపై సంయమనంతో ఉండండి..ధిక్కరిస్తే కఠిన చర్యలే: సోషల్ మీడియాలో రెచ్చగొడితే గ్యాంగ్స్టర్ యాక్ట్..
అయోధ్య అంశం పైన తీర్పు వస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులు అప్రమత్తమయ్యారు. తీర్పు పైన ఎవరైనా అనుచింతగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వాలు స్పష్టం చేసాయి. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వారి మీద గ్యాంగ్ స్టర్ యాక్ట్ తో పాటుగా..జాతీయ భద్రతా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి.
తీర్పు వెల్లడికి ముందుగాని..తర్వాతగానీ వాట్సప్..ఫేస్బుక్.. ఇన్స్టాగ్రాం.. ట్విట్టర్తో సహా ఏ సోషల్ మీడియా మాధ్యమం ద్వారానైనా హింసను ప్రేరేపించేలా చేసినా.. మతవిద్వేషాలను రగిలించేలా.. విద్వేషపూరిత పోస్టింగ్స్ పెడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Ayodhya Verdict: 134ఏళ్లుగా నడుస్తున్న చరిత్ర...మలుపులు, తీర్పులు..నేటితో ముగింపు
సంయమనం కోల్పోవద్దు..
అయోధ్య వివాదాస్పద భూమి కేసులో తుదితీర్పును శనివారం వెల్లడించేందుకు సుప్రీంకోర్టు సిద్ధమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటుగా అన్ని రాష్ట్ర..కేంద్ర పాలిత ప్రాంత అధికారులు కీలక సూనలు..ఆదేశాలు జారీ చేసారు. సర్వోన్నత న్యాయస్థానం వెలువరించనున్న తీర్పుపై ఎలాంటి ఊహాగానాలూ చేయరాదని.. తీర్పు ఎలా ఉన్నప్పటికీ ప్రజలు సంయమనం కోల్పోరాదని.. అన్ని వర్గాలవారూ సామరస్యంతో మెలగాలని నోయిడా జిల్లా మేజిస్ట్రేట్ సూచించారు.
నోయిడాలో మాత్రమే గాక దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనా యంత్రాంగాలు కూడా ఇదే విధమైన ఆదేశాలను తమ తమ పరిధులలో జారీ చేశాయి. ఇదే సమయంలో ఆదేశాలను అతిక్రమించిన వారి పైన తీవ్ర చర్యలు ఉంటాయని స్పష్టం చేసారు. తీర్పు నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలను వేగవంతం చేసాయి.
పుకార్లకు ప్రభావితం కావద్దు..
తీర్పు వెలువడనున్న పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ అధికారులు అప్రమత్తంగా వ్యవహిరిస్తున్నారు. రాష్ట్రంలోని ఉత్తరప్రదేశ్లోని గౌతమబుద్ధనగర్ జిల్లాలో ఉన్న నోయిడా నగరం మన దేశంలోని అతిపెద్ద వాణిజ్య, పారిశ్రామిక నగరాల్లో కీలకమైనది. మన దేశ రాజధాని న్యూఢిల్లీకి అత్యంత చేరువలో ఉంది. శాటిలైట్ సిటీగా, నేషనల్ క్యాపిటల్ రీజన్లో భాగంగానూ ఉన్న నోయిడా నగరంలో ఎన్నో పరిశ్రమలు, వ్యాపార సంస్థల జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యాలయాలున్నాయి. దేశవిదేశాలకు చెందిన వివిధ మతాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు.
సుమారు ఆరున్నర లక్షల పైచిలుకు ప్రజలున్న ఈ నగరంలో శాంతి భద్రతలు ఏ మాత్రం అదుపుతప్పినా దాని ప్రభావం ఎంతో తీవ్రంగా ఉంటుంది. దీంతె.. అక్కడ ఎలాంటి పరిస్థితిలోనూ శాంతి భద్రతలు అదుపు తప్పకుండా చూసేందుకు నోయిడా పోలీసులు వివిధ ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సున్నితమైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పలు వర్గాల ప్రజల, స్థానిక నేతలు, మతనేతలు, ప్రజాప్రతినిధులు, అధికార, అనధికార ప్రముఖులతో వివిధ స్థాయుల పోలీస్ అధికారులు సమావేశమై అయోధ్య తీర్పుపై భావోద్వేగాలకు గురికావద్దని, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ప్రభావితం కావద్దని, పుకార్లను అస్సలు నమ్మవద్దని కోరారు.