Ayodhya verdict:2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు..ఆ తీర్పులో ఏం చెప్పారు..?ఈ తీర్పులో ఏం చెప్తారు ?
Recommended Video
వివాదాస్పద రామజన్మభూమి బాబ్రీ మసీదు కేసు విషయంలో నేడు సంచలన తీర్పు వెలువడనున్న నేపథ్యంలో 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన మెజారిటీ తీర్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద అయోధ్య విషయంలో నాడు ఇచ్చిన తీర్పు ఏంటి? నేడు ఫైనల్ గా ఇవ్వబోతున్న తీర్పు ఎలా ఉండబోతుంది అన్నది ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Ayodhya Verdict: 134ఏళ్లుగా నడుస్తున్న చరిత్ర...మలుపులు, తీర్పులు..నేటితో ముగింపు
2010 సెప్టెంబర్ 30న అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
అయోధ్య వివాదం సుదీర్ఘకాలంగా పరిష్కారం లేని సమస్య గా కొనసాగింది. కానీ చివరకు నేడు సుప్రీమ్ లో అయోధ్య వివాదం పై జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. చాలా కాలంగా ఈ వివాదాస్పద స్థలం కోసం హిందూ ముస్లింలు కోర్టుల బాటపట్టారు. అడుగడుగునా కోర్టు కేసులు, వివాదాలు కొనసాగాయి. ఇక ఈ వ్యవహారంపై 2010 సెప్టెంబర్ 30వ తేదీన అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది.
వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా చెయ్యాలని ఆదేశాలు
ఇంతకీ అలహాబాద్ హైకోర్టు అప్పుడు ఇచ్చిన తీర్పు ఏంటంటే వివాదాస్పద స్థలాన్ని మూడు సమాన భాగాలుగా చేయాలని, హిందూ ముస్లింలకు అప్పగించాలని, రామజన్మభూమి హిందువులకే నని అలహాబాద్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాబ్రీ మసీదును కూల్చి సీతారాముల విగ్రహాలు నెలకొల్పిన ప్రదేశం శ్రీ రాముడి జన్మ స్థలం గానే పరిగణిస్తూ దానిని రాం లల్లా విరాజమాన్ కు ఇవ్వాలని తీర్పునిచ్చింది.
వివాదాస్పద స్థలం ఉమ్మడి ప్రాంగణం అని స్పష్టీకరణ
ఇక రామ్ ఛబుత్ర, సీతార సోయిని నిర్మోహి అఖాడాకు ఇవ్వాలని, మిగతా భాగాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక వివాదాస్పద స్థలంపై యాజమాన్య హక్కులు మూడు పక్షాల వారికీ చెందుతాయని అది ఉమ్మడి ప్రాంగణం అని కోర్టు స్పష్టం చేసింది. ఇక నాడు ఈ కేసులో తీర్పునిచ్చిన త్రిసభ్య ధర్మాసనంలో జస్టిస్ డి వి శర్మ, జస్టిస్ సుధీర్ అగర్వాల్, జస్టిస్ ఎస్ యు ఖాన్ లు ఉన్నారు.
తీర్పు ఇచ్చిన త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయాలు ఇవే
ఇక నాడు వారు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలను చూస్తే జస్టిస్ డి వి శర్మ వివాదాస్పద స్థలంలో రాముడి జన్మ స్థానం అని పేర్కొన్నారు. ఇక అక్కడ బాబర్ ఇస్లామిక్ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఒక నిర్మాణాన్ని చేసినట్లుగా, ఆ నిర్మాణానికి మసీదు లక్షణాలు లేవని ఆయన పేర్కొన్నారు. జస్టిస్ సుధీర్ అగర్వాల్ హిందువుల విశ్వాసం ప్రకారం అది రామజన్మభూమి అని, అక్కడ మసీదుని ఎవరు ఎప్పుడు నిర్మించారు రుజువు కాలేదని పేర్కొన్నారు.ఇక జస్టిస్ ఎస్ యు ఖాన్ మసీదు నిర్మాణం కోసం ఏ గుడిని కూలగొట్ట లేదని చాలా కాలంగా పడి ఉన్న ఆలయ శిథిలాల మీద మసీదును నిర్మించారని పేర్కొన్నారు.
నాటి తీర్పు సంచలనం..నేడు తీర్పుపై ఉత్కంఠ
ఇక ఈ ధర్మాసనం 8189 పేజీల మెజారిటీ తీర్పును ఇవ్వడం అప్పట్లో సంచలనం. ఇక నేడు ఈ కేసుకు సంబంధించి ఫైనల్ గా జడ్జిమెంట్ రానున్న నేపథ్యంలో ఇప్పుడు తీర్పు ఏవిధంగా ఉండబోతుంది అన్న ఆసక్తి అందరిలోనూ వ్యక్తమవుతోంది. అలహాబాద్ కోర్టులో ముగ్గురికి మూడు భాగాలు చేసి ఉమ్మడి స్థలంగా తేల్చినప్పటికీ సీతారాముల విగ్రహాలు ఉన్న స్థలం మాత్రం రామజన్మభూమిదే అంటూ తీర్పునిచ్చారు. ఇక ఇప్పుడు మరికొన్ని గంటల్లో ఇవ్వనున్న తీర్పు అయోధ్య వివాదంలో సయోధ్య తీర్పు లా ఉంటుందా? అనేది మాత్రం వేచి చూడాలి.