బాబుల్ సుప్రియో సంచలన నిర్ణయం: బీజేపీతోపాటు రాజకీయాలకు గుడ్బై, ఇక సేవే మార్గం
కోల్కతా: భారతీయ జనతా పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు పెట్టారు. ఇకపై తాను సామాజిక సేవ చేయనున్నట్లు తెలిపారు. కేంద్రమంత్రివర్గం నుంచి తొలగించిన కొద్ది రోజులకే బాబుల్ సుప్రియో ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
అల్విదా.. బీజేపీతోపాటు పాలిటిక్స్కు బాబుల్ సుప్రియో గుడ్బై
'అల్వాదా.. నేను టీఎంసీ, కాంగ్రెస్, సీపీఎం.. ఇలా ఏ పార్టీలోకి వెళ్లడం లేదు. ఆ పార్టీల్లోకి రమ్మని ఎవరూ ఆహ్వానించలేదు. నేను ఒకే టీం ప్లేయర్ని. ఎప్పటికీ ఒకే పార్టీ(బీజేపీ)లో ఉంటా. నా వల్ల కొంతమంది సంతోషపడ్డారు. మరికొంత బాధపడ్డారు. ఎన్నో సుదీర్ఘ చర్చల అనంతరం నేను ఈ నిర్ణయం తీసుకున్నా. రాజకీయాల్లో ఉండి సామాజిక సేవ చేయడం సాధ్యం కాదు. నన్ను అపార్థం చేసుకోవద్దు' అంటూ బాబుల్ సుప్రియో తన పోస్టులో పేర్కొన్నారు. ఈ మొత్తం కూడా బెంగాలీలోనే రాసుకొచ్చారు.
ఎన్నికైన తొలిసారే కేంద్రమంత్రి పదవి..
ప్రముఖ గాయకుడైన బాబుల్ సుప్రియో 2014 లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఆ ఏడాది పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని అసన్సోల్ నుంచి పోటీ చేసి లోక్సభకు ఎన్నికయ్యారు. నరేంద్ర మోడీ హయాంలో తొలిసారి ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో పట్టణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అసన్సోల్ నుంచి రెండోసారి లోక్సభకు ఎన్నికయ్యారు. అప్పుడు కూడా కేంద్రమంత్రి పదవి దక్కించుకున్నారు.
బాబుల్ సుప్రియోకు రెండోసారీ కేంద్రమంత్రి పదవి దిక్కింది కానీ..
కాగా, ఇటీవల బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బాబుల్ సుప్రియో పోటీ చేశారు. అయితే, టీఎంసీ అభ్యర్థి అరూప్ బిశ్వాస్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ క్రమంలో బాబుల్ సుప్రియోపై బీజేపీ అధిష్టానం కొంత అసంతృప్తితో ఉంది. దీంతోపాటు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్తో బాబుల్కు విభేదాలు పొడచూయాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన కేంద్రమంత్రివర్గ విస్తరణలో బాబుల్ సుప్రియో మంత్రి పదవిని కోల్పోయారు. ఈయనతోపాటు మరో 12 మంది కూడా కేంద్రమంత్రి పదవులను కోల్పోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో బాబుల్ సుప్రియో బీజేపీతోపాటు రాజకీయాలకు కూడా గుడ్బై చెప్పినట్లు తెలుస్తోంది.