బదాయూ కజిన్స్ మృతి: ఆత్మహత్య అని సిబిఐ, ఫ్యామిలీ ఫైర్
బదాయూ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదాయూలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు చెట్టుకు ఉరివేసుకుని మరణించిన కేసులో ఎవరి ప్రమేయమూ లేదని, వారు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని సిబిఐ భావిస్తోంది. ఈ కేసులో ఎవరిపై కూడా అభియోగాలు నమోదు చేయడం లేదని తెలిపింది. పలువురు సాక్షులను విచారించి రూపొందించిన నలబై నివేదికల ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు సిబిఐ స్పష్టం చేసింది.
బాలికలపై సామూహిక అత్యాచారం చేసి వారిని హత్య చేశారని తొలుత పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటాప్సీ నివేదిక కూడా అత్యాచారం జరిగిందని తెలిపింది. దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లు సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే వారికి వ్యతిరేకంగా ఏ విధమైన సాక్ష్యాధారాలు లేవని సిబిఐ అంటోంది. ఈ కేసులో శుక్రవారంనాడు సిబిఐ తన నివేదికను సమర్పించనుంది.
వారెందుకు ఆత్మహత్య చేసుకుంటారనే విషయాన్ని సిబిఐ వివరించలేదని, తమకు న్యాయం జరగకపోతే తమను తాము చంపుకుంటామని మృతి చెందిన బాలికల్లోని ఒక బాలిక తండ్రి అన్నారు. బాలికలను ఐదుగురు వ్యక్తులు ఎత్తుకుపోయి, వారిపై అత్యాచారం చేసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సిబిఐ ఈ కేసు దర్యాప్తును జూన్లో తన చేతుల్లోకి తీసుకుంది.
గత మే నెలలలో ఉత్తరప్రదేశ్లోని బడౌన్ గ్రామంలో సామూహిక అత్యాచారం, హత్యకు గురైనట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇద్దరు మైనర్ బాలికల మృతదేహాలకు తాజాగా మరోసారి శవపరీక్ష నిర్వహించాలని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఇంతకు ముందు నిర్ణయించింది. 14, 15 ఏళ్ల వయసు కలిగిన ఈ ఇద్దరు మైనర్ బాలికల శవాలు గ్రామంలోని ఒక మామిడి
చెట్టుకు వేలాడుతూ కనిపించడం తెలిసిందే. ఈ ఇద్దరిపై సామూహిక అత్యాచారం జరిపిన తర్వాత హత్య చేశారన్న ఆరోపణలు రావడం, దానిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించింది.
గత మే 27వ తేదీ రాత్రి కనిపించకుండా పోయిన ఈ బాలికలు ఆ మర్నాడు ఉదయం గ్రామంలోని మామిడి చెట్టుకు శవాలుగా వేళ్లాడుతూ కనిపించారు. ఈ బాలికలపై అత్యాచారం జరిపిన తర్వాత హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలు ధృవీకరించాయి. బాలికలు కనిపించకుండా పోయిన రోజు రాత్రే తాము ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు స్పందించలేదని బాలికల కుటుంబసభ్యులు ఆరోపించారు.