మమతపై చర్యలు తీసుకోండి... ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ..
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్లో హింస చెలరేగడానికి సీఎం మమత బెనర్జీ కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న మమత బెనర్జీ ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధించాలని అందులో పేర్కొంది. బెంగాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీలు ఈ కంప్లైంట్ చేశారు.
బెంగాల్లో తృణమూల్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని, రాజ్యాంగ వ్యవస్థల్ని మమత తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారని నేతలు ఫిర్యాదులో ప్రస్తావించారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ ధ్వంసమైనందున మే 19న జరిగే చివరి విడత ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొనకుండా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
సార్వత్రిక ఎన్నికల తొలి విడత ఎన్నికల నుంచి బెంగాల్లో తీవ్ర హింస చెలరేగింది. ప్రతి దఫాలోనూ టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరగడం పోలీసులు లాఠీఛార్జ్ చేయడం పరిపాటిగా మారింది. గత ఆదివారం జరిగిన ఆరో దశ ఎన్నికల్లోనూ అల్లర్లు చెలరేగడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పలువురికి గాయాలై పోలింగ్కు అంతరాయం ఏర్పడింది.
తాజాగా కోల్కతాలో అమిత్ షా పాల్గొన్న ఎన్నికల ప్రచారసభలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. ఫలితంగా అమిత్ షా ర్యాలీ మధ్యలోనే నిలిపేయాల్సి వచ్చింది. ఈ ఘటన అనంతరం కోల్కతాలోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది. అమిత్ షా ర్యాలీలో తృణమూల్ కార్యకర్తల వీరంగంపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో చివరి విడత ఎన్నికల్లో మమతపై ఆంక్షలు విధించాలని బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.