మహా సీఎం ఫడ్నవీస్తో ముంబైలో దత్తాత్రేయ(ఫోటోలు)
ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను కేంద్రమంత్రి, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు బండారు దత్తాత్రేయ కలిశారు. ముంబైలో దత్తాత్రేయ ఆయనను కలిశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఫడ్నవీస్ ప్రభుత్వం బుధవారం బలపరీక్షను ఎదుర్కొని గట్టెక్కిన విషయం తెలిసిందే.
కాగా, బుధవారం ఉదయం బండారు దత్తాత్రేయ కేంద్ర జౌళీశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ను కలిశారు. పత్తి రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.
పారికర్ సహా పదిమంది రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవం
రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, సమాజ్ వాది పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్ సహా ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభకు పోటీ చేస్తున్న పదిమంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. నామినేషన్ల పరిశీలన మంగళవారం పూర్తయింది. ఇప్పటికి పదిమంది మాత్రమే బరిలో నిలిచారు. 11 మంది నామినేషన్ దాఖలు వేసినప్పటీకీ.. ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో ఖమర్ అహ్మద్ అనే అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురయింది. ఫలితాలు గురువారం వస్తాయి.
మోడీ నమ్మకాన్ని నిలబెడతా: జేపీ నడ్డా
ప్రజలందరికీ సంపూర్ణమైన ఆరోగ్య సౌకర్యాలను కల్పించాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆలోచనలను సాకారం చేయడమే తన లక్ష్యమని కొత్త ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మంగళవారం స్పష్టం చేశారు. అత్యంత ప్రాధాన్యతాపూర్వకంగా దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలను విస్తరిస్తామన్నారు.
తనకు ఆరోగ్య మంత్రిత్వ శాఖను అప్పగించడంలో ప్రధాని ఉద్దేశం ఈ బాధ్యతను తాను పరిపూర్ణంగా నిర్వర్తించగలనన్న నమ్మకమేనన్నారు. దేశంలో ఆరోగ్య రంగానికి సంబంధించి అన్ని అంశాలను లోతుగా పరిశీలించే చర్యలు చేపట్టానని, త్వరలోనే ఇందుకు సంబంధించి తన ప్రణాళికలను ఆవిష్కరిస్తానని వెల్లడించారు.
సమగ్ర దృక్పథంతో దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తేవాలన్నదే తన ఉద్దేశమని ఇందుకు అనుగుణంగా లోపరహితమైన కార్యాచరణను అమలులోకి తీసుకొస్తానన్నారు. మోడీతో పాటు పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు కూడా తన పట్ల పూర్తి నమ్మకముందని, వారిద్దరి ప్రోత్సాహంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖను సమర్థంగా ముందుకు తీసుకువెళతానన్నారు.
దేశంలో ఆరోగ్య సేవల లభ్యత విషయంలో మోడీకి ఓ స్పష్టమైన దృక్పథం ఉందని, ఈ రంగాన్ని తదనుగుణంగా తీర్చిదిద్దే బృహత్తర బాధ్యతను తనకు అప్పగించారన్నారు. కొత్తగా ఈ బాధ్యత చేపట్టిన తాను ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలిస్తున్నానని, నెలరోజుల వ్యవధిలోనే ఏవిధంగా ఆరోగ్య సేవలను మెరుగుపరచాలన్న దానిపై స్పష్టమైన వ్యూహంతో ముందుకు రాగలుగుతానన్నారు.