గ్రామీ అవార్డుకు నామినేటైన బెంగళూరు యువ సంగీతకారుడు
ముంబై: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు చెందిన సంగీత కళాకారుడు రికీ కేజ్ ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుకు నామినేటయ్యారు. ‘విండ్స్ ఆఫ్ సమ్సరా' అనే ఆల్బమ్ రూపొందించినందుకు గానూ 2015 బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ కేటగిరిలో అతడు నామినేట్ అయ్యారు.
దక్షిణాఫ్రికాకు చెందిన ఫ్లూటిస్ట్ వాటర్ కెలెర్మాన్తో కలిసి రికీ కేజ్ ఈ ఆల్బమ్ను రూపొందించారు. కీబోర్డ్ను అద్భుతంగా వాయించే రికీ కెజ్.. ఈ కేటగిరిలో అవార్డుకు నామినేటైన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
‘విండ్స్ ఆఫ్ సమ్సరా అనే ఆల్బమ్ శాంతి, సానుకూలతను దృక్పథాన్ని ప్రతిబింబేంచేదిగా ఉంటుంది. అందరం కలిసి సామరస్యంగా ముందుకు కదలాలి. ప్రగతిశీల కూర్పు, కొత్త సాంకేతికతతో ఉత్సాహం లాంటి అంశాలతో నూతన జనరేషన్కి తొలిసారిగా కొత్త అభిరుచిని ఈ ఆల్బమ్ అందించింది' అని వెబ్సైట్ అధికారులు తెలిపారు.
సంగీత విభాగంలో నూతన శైలిలో ప్రతిభ కనబర్చిన వారికి అమెరికాకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ రికార్డింగ్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్.. గ్రామీ అవార్డులను అందజేస్తుంది. సంగీత ప్రపంచంలో ఈ అవార్డును ఆస్కార్గా భావిస్తారు.