
విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ ఛోక్సీల నుంచి బ్యాంకులకు రూ. 18వేల కోట్లు: సుప్రీంకు కేంద్రం
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపారస్తులు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ ఛోక్సీ కేసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది. ఇప్పటి వరకు రూ. 18వేల కోట్లను ఆయా బ్యాంకులకు బదిలీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు.

సుప్రీంకోర్టుకు పీఎంఎల్ఏ కేసుల వివరాలు
మనీలాండరింగ్ కేసులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు ఉన్న విస్తృత అధికారాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా కేంద్రం ఈ వివరాలు సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్(పీఎంఎల్ఏ)కు సంబంధించి ప్రస్తుతం 4700 కేసులను ఈడీ దర్యాప్తు జరుపుతోందని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనానికి కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు.

మాల్యా, నీరవ్ మోడీ, చోక్సీల నుంచి బ్యాంకులకు రూ. 18వేల కోట్లు
మొత్తం రూ. 67వేల కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రతియేటా ఈ కేసుల సంఖ్య మారుతుందన్న సొలిసిటర్ జనరల్.. 2015-16లో 111 కేసులను స్వీకరించగా, 2020-21లో వీటి సంఖ్య 981కి పెరిగిందని తెలిపారు. ఇక విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ కేసులకు సంబంధించి మొత్తం రూ. 18వేల కోట్లను బ్యాంకులకు అందజేశామని సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఎస్జీ తెలిపారు.
Recommended Video

2086 కేసులు మాత్రమే పీఎంఎల్ఏ కింద విచారణ
పీఎంఎల్ఏ కింద ప్రతియేటా తక్కువ సంఖ్యలోనే దర్యాప్తులు చేపడుతున్నామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. గడిచిన ఐదేళ్లలో(2016-2017 నుంచి 2020-2021 వరకు) దేశ వ్యాప్తంగా పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు 33 లక్షల ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా, వాటిలో 2086 కేసులను మాత్రమే పీఎంఎల్ఏ కింద దర్యాప్తునకు స్వీకరించామని పేర్కొంది. యూకే 7900, అమెరికా 1532, చైనా 4691, ఆస్ట్రియా 1036, హాంకాంగ్ 1823, బెల్జియం 1862, రష్యా 2764 దేశాలతో పోలిస్తే మనీలాండరింగ్ కు సంబంధించి కేసులు తక్కువగానే దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించింది. కాగా, సెర్చ్, సీజ్, ఇన్వెస్టిగేషన్ మరియు చట్టం కింద వచ్చిన ఆదాయాన్ని అటాచ్మెంట్ చేయడం కోసం డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ (ఈడీ)కి అందుబాటులో ఉన్న విస్తృత అధికారాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారిస్తోంది.