ఇదేం దిక్కుమాలిన పని.. గబ్బిలాలతో చిల్లీ చికెన్ !
దేశవ్యాప్తంగా కల్తీ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మరీ ముఖ్యంగా మాంసం విషయంలో ఈ బాగోతాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. కాగా ఇప్పుడు లేటెస్ట్ గా తమిళనాడులో చోటు చేసుకున్న దారుణ సంఘటన అందరిని కలవరపెడుతోంది. గబ్బిలం మాంసాన్ని చికెన్ పేరుతో హోటళ్లకు సరఫరా చేసిన వ్యవహారం బట్టబయలైంది. ఈ ఘటన స్థానికంగా భయాందోళనకు తెరలేపింది.
గబ్బిలం మాంసంతో చిల్లీ చికెన్..
సేలం జిల్లా డేనిష్పేట డేనిష్పేట సమీపంలోని అటవీ ప్రాంతంలో తుపాకులతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద గబ్బిలాల మృత దేహాలు, తుపాకులు, కత్తులు, బ్లేడ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను సెల్వం, కమల్ గా గుర్తించారు. ఈ క్రమంలోనే పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి.

గత కొన్ని నెలలుగా వీరు వందల సంఖ్యలో గబ్బిలాలను వేటాడి.. వాటిని చిన్న ముక్కలుగా చేసి స్థానిక హోటళ్లకు, బార్లకు చికెన్ పేరుతో సరఫరా చేస్తున్నట్లు అంగీకరించారు. ఈ మాంసాన్ని చిల్లీ చికెన్, మసాలా ఫ్రై, చికెన్ పకోడా లాగా అమ్మకాలు జరిపినట్టు తెలిపారు.
కేవలం హోటళ్లు మాత్రమే కాకుండా.. మద్యం షాపుల వద్ద కూడా "చికెన్ పకోడా"గా ఈ కల్తీ మాంసం విక్రయించేవారని పోలీసులు కనిపెట్టారు.
అయితే గబ్బిలాలలో పలు ప్రమాదకర వైరస్లు ఉండే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గతంలో నిపా, సార్స్, కొవిడ్ వంటి వైరస్లు కూడా గబ్బిలాల ద్వారానే వ్యాపించాయని ఆధారాలున్నాయి. ఈ పరిస్థితుల్లో అలాంటి మాంసాన్ని తినడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, వైరల్ వ్యాధులు, ఆహార విషబాధలు సంభవించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గతంలోనూ..
గతంలోనూ చెన్నైలో కుక్క మాంసాన్ని మటన్ బిర్యానీ లాగా హోటళ్లలో విక్రయించిన సంఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గబ్బిలాల మాంసం కేసు వెలుగులోకి రావడంతో ప్రజలు ఆందోళనకు లోనవుతున్నారు.
నిందితులిద్దరిని అరెస్ట్ చేసి పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఇంకా ఎంత మంది ఈ ముఠాలో ఉన్నారు? ఎన్ని హోటళ్లకు ఇది సరఫరా అయ్యింది? ఎలాంటి నెట్వర్క్ ఈ వెనక ఉంది? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications