బిచ్చగాడే.. పెద్ద మనసుతో.. 'చిల్లర కష్టాలు' తీరుస్తున్నాడు
చెన్నై : పెద్ద నోట్ల రద్దు సామాన్యుడికి పెద్ద తలనొప్పిగా పరిణమించిన సంగతి తెలిసిందే. గంటల తరబడి బ్యాంకుల ముందు ఏటీఎంల ముందు పడిగాపులు కాస్తున్నా.. నగదు దొరకని పరిస్థితి. మరోవైపు బ్యాంకుల్లో ఇచ్చే కొత్త రూ.2వేల నోటుకు చిల్లర దొరక్క చాలామంది నానా పాట్లు పడుతున్నారు.

ఇలాంటి తరుణంలో.. చెన్నైలోని ఎగ్మూరు రైల్వే స్టేషన్ లో రామస్వామి అనే ఓ బిచ్చగాడు పాత రూ.500నోట్లకు చిల్లర ఇస్తుండడం ప్రతీ ఒక్కరిని విస్మయానికి గురిచేస్తోంది. రైల్వే స్టేషన్ లో చిల్లర దొరక్క ఇబ్బంది పడుతున్నవారి నుంచి రద్దయిన రూ.500నోట్లను తీసుకుని చిల్లర ఇస్తున్నాడు రామస్వామి. అయితే ఇలా రద్దయిన నోట్లను తీసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి కదా! అని ప్రశ్నించగా.. తనకు బ్యాంకు ఖాతా ఉందని అక్కడికెళ్లి ఈ నోట్లను మార్చుకుంటానని బదులిస్తున్నాడు.
ఇంతకీ అసలు విషయమేంటంటే.. నిజానికి రామస్వామి బిచ్చగాడు కాదు. అతనో ప్రైవేటు సంస్థలో చాన్నాళ్లు ఉద్యోగం చేశాడు. ఆ క్రమంలో.. ఓ రోడ్డు ప్రమాదం అతనికి చూపు పోగొట్టడంతో.. ఉద్యోగానికి దూరమైపోయాడు. దీంతో అప్పటినుంచి రైల్వే స్టేషన్ లో బిచ్చగాడిగా మారిపోయాడు. తాను కూడబెట్టుకున్న చిల్లరనంతా.. ఇప్పుడు ప్రయాణికుల అవసరం కోసం ఇచ్చేస్తున్నాడు. దీంతో రామస్వామి పెద్ద మనసును అక్కడి ప్రయాణికులంతా అభినందిస్తున్నారు.












Click it and Unblock the Notifications