రేప్ కేసులు: స్వామీజీకి సమన్లు ఇచ్చిన కోర్టు
బెంగళూరు: రెండు అత్యాచారాల కేసులలో ఆరోపణలు ఎదుర్కోంటున్న రామచంద్రాపుర మఠాధిపతి రాఘవేశ్వర భారతి స్వామీజీకి సమన్లు జారీ చేసిన న్యాయస్థానం విచారణకు కచ్చితంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
శుక్రవారం (అక్టోబర్ 9) కోర్టు ముందు హాజరుకావాలని బెంగళూరు 1వ ఎసీఎంఎం న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రెండు రేప్ కేసులలో రాఘవేశ్వర భారతి స్వామీజీ ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. స్వామీజీ వైద్య పరిక్షలకు హాజరుకాలేదని సీఐడి అధికారులు ఆరోపించారు.
రాఘవేశ్వర భారతికి ఇచ్చిన ముందస్తు జామీను రద్దు చెయ్యాలని సీఐడి అధికారులు కోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీ.ఏ. బెళ్లియప్ప సీఐడి అధికారుల తరుపన కోర్టులో వాదించారు. అత్యాచారం కేసులలో రాఘవేశ్వర భారతి స్వామీజీ మూడు వైద్య పరిక్షలకు హాజరుకాలేదని కోర్టులో చెప్పారు.
స్వామీజీకి నోటీసులు జారీ చేసినా ఆయన పట్టించుకోలేదని, తాను ఇప్పటికే డీఎన్ఏ పరిక్షలు చేయించుకున్నానని, వైద్య పరిక్షలు అవసరం లేదని స్వామీజీ అంటున్నారని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.
కేసు పూర్తి వివరాలు తెలుసుకున్న న్యాయస్థానం గురువారం స్వామీజీకి సమన్లు జారీ చేసింది. ఒక సింగర్ తో పాటు మరో మహిళపై అత్యాచారం చేశారని రాఘవేంద్ర భారతి స్వామీజీ ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. ఈ కేసులు సీఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.