బెంగళూరు వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రభుత్వం సంచలన నిర్ణయం, చివరి నిమిషంలో!
బెంగళూరు: బెంగళూరు వరుస బాంబు పేలుళ్ల కేసులో కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసింది. బెంగళూరు నగరంలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో పీపుల్స్ డెమాక్రటిక్ పార్టీ (పీడీపీ) వ్యవస్థాపకులు అబ్దుల్ మాదాని ప్రముఖ నిందితుడు.
ఈ కేసు వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను తప్పించాలని కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని వెలుగు చూసింది. అదే జరిగితే కొత్త పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసు వివరాలు అధ్యయనం చేసి వాదనలు వినిపించడానికి ఆలస్యం అయ్యే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో బెంగళూరు వరుస బాంబు పేలుళ్ల కేసు విచారణ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని మాజీ డీజీపీ శంకర బిదిరి ఆందోళన వ్యక్తం చేశారు.
వరుస బాంబు పేలుళ్లు
2008లో బెంగళూరులో 9 ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ వరుస బాంబు పేలుళ్లలో ఇద్దరు మరణించి 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో కేరళకు చెందిన పీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు అబ్దుల్ మదానిని అరెస్టు చేసి బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది.
అబ్దుల్ మదాని డ్రామాలు
రక్తపోటు, బీపీ తదితర వ్యాదులతో భాదపడుతున్నానని, కళ్లు సరిగా కనపడం లేదని, కేరళలో ఆయుర్వేద చికిత్స చేయించుకోవడానికి తనకు అవకాశం ఇవ్వాలని అబ్దుల్ మదాని కోర్టును ఆశ్రయించాడు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోని ఆసుపత్రిలో అబ్దుల్ మదానికి ప్రత్యేక చికిత్సలు చేస్తున్నామని కర్ణాటక ప్రభుత్వం కోర్టులో వాదించింది.
బెయిల్ ఇవ్వండి
అనారోగ్యంతో బాధపడుతున్న తనకు పెరోల్ ఇవ్వాలని అబ్దుల్ మదాని కోర్టును ఆశ్రయించాడు. అబ్దుల్ మదాని ప్రతిరోజూ దినపత్రికలు చదవుతున్నాడని, టీవీ చూస్తున్నాడని, ఆయన ఎలాంటి అనారోగ్యంతో భాదపడలేదని ప్రభుత్వం కోర్టులో వాదించింది. పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న సీసీ కెమోరాల్లో అబ్దుల్ మదాని దినచర్యలు రికార్డు అయ్యాయని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
కోర్టు డెడ్ లైన్
ఉగ్రవాద కార్యకలాపాల కేసులు విచారణ చేసే ప్రత్యేక కోర్టులో సెప్టెంబర్ 20వ తేదీ బెంగళూరు వరుస బాంబు పేలుళ్ల కేసు విచారణ జరిగింది. నవంబర్ 20వ తేదీలోపు కేసు విచారణ పూర్తి చెయ్యాలని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ దాదాపు పూర్తి అయ్యింది. ఇదే నెల 20వ తేదీ కోర్టులో కేసు విచారణ జరగనుంది.
ప్రభుత్వంపై ఒత్తిడి?
బెంగళూరు వరుస బాంబు పేలుళ్ల కేసును ప్రత్యేక కోర్టులో మొదట ప్రత్యేక పబ్లిక్ ప్యాసిక్యూటర్ రుద్రస్వామి వాదించారు. అనంతరం రుద్రస్వామి స్థానంలో సదాశివ మూర్తిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ సదాశివ మూర్తి కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. అయితే సదాశివ మూర్తి స్థానంలో వేరే న్యాయవాదిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించాలని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక పబ్లిక్ ప్యాసిక్యూటర్ ను మార్చే అధికారం ప్రభుత్వానికి ఉంది. అయితే సమయం, సందర్బం లేకుండా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోపణలు ఉన్నాయి.
మాజీ డీజీపీ ఫైర్
బెంగళూరు వరుస బాంబు పేలుళ్ల కేసు వాదనలు వినిపిస్తున్న ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఎందుకు మార్చాలని నిర్ణయం తీసుకున్నారని మాజీ డీజీపీ, బీజేపీ నాయకుడు శంకర్ బిదరి కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రధాన నిందితుడు అబ్దుల్ మదాని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తున్నాడా ? అనే అనుమానం ఉందని శంకర బిదరి ట్వీట్ చేశారు. పదేపదే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మార్చుకుంటుపోతే కేసు నుంచి అబ్దుల్ మదాని తప్పించుకునే అవకాశం ఉందని మాజీ డీజీపీ శంకర్ బిదరి ఆందోళన వ్యక్తం చేశారు.