కాలేజీ అమ్మాయిపై బస్ డ్రైవర్ రేప్, ఫొటోలతో బెదిరింపు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో మరో దారుణమైన సంఘటన నమోదైంది. ఓ పాఠశాల బస్సు డ్రైవర్ ఓ కళాశాల అమ్మాయిపై అత్యాచారం చేయడమే కాకుండా అమెను బ్లాక్ మెయిల్ చేసినట్లు, బలవంతపు వసూలుకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
సంజీవ్ మూర్తి అనే 28 ఏళ్ల బస్సు డ్రైవర్ అక్టోబర్ 25వ తేదీన 19 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేసాడు. మైసూరు రోడ్డులోని కెంగేరి ఓంకార హిల్స్ వద్ద గల నిర్మానుష్యమైన ఇంటిలో మిత్రుడితో ఉన్న అమ్మాయిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆ అమ్మాయి మిత్రుడి ఫోన్ కూడా లాక్కున్నాడు.
ఆ తర్వాత ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ తాను మౌనంగా ఉండడానికి డబ్బులు డిమాండ్ చేస్తూ వచ్చాడు. మూర్తి వసూళ్ల కోసం కాల్స్ పెరగడంతో ఓ కన్నడ సంఘానికి చెందిన కుటుంబ సభ్యుడి ఆరాతో విషయం బయటకు వచ్చింది. సంఘం సభ్యులు అమ్మాయిని మంగళవారం సాయంత్రం కంగేరి పోలీసు స్టేషన్కు తీసుకుని వెళ్లారు.
పోలీసులు రంగంలోకి దిగి అమ్మాయి నుంచి దొంగిలించిన ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మూర్తి ఆచూకి కనిపెట్టి అతన్ని అరెస్టు చేశారు. అక్టోబర్ 25వ తేదీన నిర్మానుష్యంగా ఉన్న ఇంట్లో అమ్మాయి, ఆమె మిత్రుడు మాట్లాడుకుంటుండగా మూర్తి అక్కడికి వచ్చాడు. మిత్రుడి ఫోన్ లాక్కున్నాడు. ఇద్దరు అతనితో వాదనకు దిగారు. దాంతో మూర్తి యువకుడిపై దాడి చేశాడు. అమ్మాయి అరిస్తే చంపేస్తానంటూ బెదిరించాడు.
అత్యాచారం చేసిన తర్వాత అమ్మాయి ఫొటోలు తీసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాంతో షాక్ తిన్న అమ్మాయి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడానికి కూడా భయపడింది. ఆ తర్వాత మూర్తి ఆమెను వదిలిపెట్టలేదు. పోన్ చేసి బెదిరిస్తూ ఫొటోలు ఇంటర్నెట్లో పెడుతానని బెదిరిస్తూ డబ్బులు లాగడం ప్రారంభించాడు. ఓసారి అతను అడిగిన డబ్బు ఇచ్చింది. దాంతో ఆగకుండా పదే పదే ఫోన్లు చేయడం ప్రారంభించాడు.
దాంతో అమ్మాయి తన బంధువుతో విషయాన్ని చెప్పింది. ఆ బంధువు కన్నడ అనుకూల సంఘాన్ని అప్రమత్తం చేశారు. ఆ సంఘం సహాయంతో అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.