బాంబు పేలుడు: సీసీ కెమెరాలో నిందితుడు (వీడియో)
బెంగళూరు: బెంగళూరు నగరంలోని ఎంజీ రోడ్డు సమీపంలోని చర్చి స్ట్రీట్ లో జరిగిన బాంబు పేలుడు కేసులో అనుమానిత ఉగ్రవాదిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు గుర్తించారు. అతను బ్యాగ్ తో ఆ ప్రాంతంలో పలు సార్లు అనుమానాస్పదంగా సంచరించాడని అధికారులు చెప్పారు.
బాంబు పేలుడు జరిగిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలో అతను అనుమానాస్పదంగా సంచరించిన దృశ్యాలు గుర్తించారు. 2014 డిసెంబర్ 28వ తేది రాత్రి 8.32 గంటల సమయంలో చర్చిస్ట్రీట్ లోని కోకోనెట్ గ్రోవ్ రెస్టారెంట్ సమీపంలో బాంబు పేలుడు జరిగింది.
బెంగళూరు పోలీసులు మొదట కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో కేసు ఎన్ఐఏ అధికారులకు అప్పగించారు. హైదరాబాద్ లోని ఎన్ఐఏ అధికారుల ప్రత్యేక బృందం కేసు విచారణ చేస్తున్నది.
ఎన్ఐఏ అధికారులు సీసీ టీవీ కెమెరాలోని క్లిప్పింగ్స్ పరిశీలించారు. నీలి రంగ టీ షర్టు, తలకు క్యాప్ వేసుకున్న వ్యక్తి అదే రోజు రాత్రి 7 గంటల నుంచి పలు సార్లు ఆ ప్రాంతంలో సంచరించాడని అధికారులు వెల్లడించారు.
అతని దగ్గర ఓ బ్యాగ్ ఉందని, అందులోనే బాంబు తీసుకువచ్చిపెట్టాడని అనుమానం వ్యక్తం చేశారు. ఈ బాంబు దాడిలో చెన్నైకి చెందిన ఓ మహిళ మరణించింది. నిందితుడి ఆచూకి చెప్పిన వారికి రూ. 5 లక్షలు బహుమానం ఇస్తామని ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు ప్రకటించారు.