బెంగళూరులో 2 వేల చోట్ల హైఫై హాట్ స్పాట్స్, ఫ్రీ ఇంటర్నెట్, పార్క్ ల్లో పండగే !
బెంగళూరు: ఐటీ-బీటీ సంస్థలకు దేశ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరంలో 2 వేల ప్రముఖ ప్రాంతాల్లో ఉచిత హైఫై హాట్ స్పాట్ లు ఏర్పాటు చెయ్యడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ముందు బెంగళూరు నగరంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రానుంది.
ఐటీ-బీటీ శాఖ ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ మూడు నెలల్లో బెంగళూరులో 2 వేల ప్రాంతాల్లో ఉచిత హైఫై హాట్ స్పాట్ లు ఏర్పాటు చేస్తామని అన్నారు. మెట్రో రైల్వే స్టేషన్లు, మాల్స్, బీఎంటీసీ బస్ స్టాండ్ లు, పార్కులతో పాటు ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో వైఫై హాట్ స్పాట్స్ ఏర్పాటు చేస్తామని గౌరవ్ గుప్తా అన్నారు.
బెంగళూరు నగరంలో ఇప్పటికే 2 వేల ప్రాంతాలు గుర్తించామని, వైఫై హాట్ స్పాట్ ల సౌలభ్యం కల్పించడానికి టెండర్లు ఆహ్వానించామని గౌరవ్ గుప్తా చెప్పారు. మూడు నెలల్లో అన్ని పనులు పూర్తి చేసి ప్రజలకు ఉచిత ఇంటర్నెట్ సౌలభ్యం కల్పిస్తామని గౌరవ్ గుప్తా వివరించారు.
వైఫై హాట్ స్పాట్స్ ఏర్పాటు చెయ్యడానికి బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) నుంచి కొన్ని సమస్యలు ఎదురౌతున్నాయని, ఐటీ-బీటీ శాఖ మంత్రి బీబీఎంపీ కమిషనర్ తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తున్నారని గౌరవ్ గుప్తా వివరించారు.
2017 టెలికం పాలసీ ఆధారంగా బీబీఎంపీ వైఫై హాట్ స్పాట్స్ ఏర్పాటు చెయ్యడానికి అనుమతి ఇస్తుందా ? లేదా తామే ప్రత్యేకంగా స్థంభాలు ఏర్పాటు చేసుకోవాలా ? అని చర్చ జరుగుతోందని ఐటీ-బీటీ శాఖ ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తా మీడియాకు చెప్పారు.