బెంగళూరు స్వామీజీతో నటి రాసలీలలు, 10 మంది నన్ను వేధించారు, నాశనం, వదిలిపెట్టను !
బెంగళూరు నగర శివార్లలోని యలహంక సమీపంలోని హుణసమారనహళ్ళి మద్దవేణపుర జంగమ మఠంకు చెందిన దయానంద స్వామిజీ రాసలీలల వ్యవహారం మంగళవారం (నవంబర్ 28వ తేదీ) మళ్లీ తెరమీదకు వచ్చింది.
బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని యలహంక సమీపంలోని హుణసమారనహళ్ళి మద్దవేణపుర జంగమ మఠంకు చెందిన దయానంద స్వామిజీ రాసలీలల వ్యవహారం మంగళవారం (నవంబర్ 28వ తేదీ) మళ్లీ తెరమీదకు వచ్చింది. తనను 10 మంది వేధింపులకు గురి చేసి బలిపశువును చేశారని, నా జీవితం నాశనం చేశారని, వారిని వదిలిపెట్టనని దయానంద స్వామీజీతో రాసలీలలో వీడియోలో ఉన్న స్యాండిల్ వుడ్ నటి అన్నారు.
మంగళవారం స్వామీజీతో రాసలలీలలో ఉన్న నటి ఓ వీడియోను మీడియాకు విడుదల చేసింది. తనకు ప్రాణహాని ఉందని, అందుకే మీడియా ముందుకు రాలేకపోతున్నానని, అందుకే వీడియో విడుదల చేస్తున్నానని స్యాండిల్ వుడ్ నటి వివరించింది.
అనారోగ్యం, ప్రాణహాని !
మీడియాకు విడుదల చేసిన వీడియోలో స్యాండిల్ వుడ్ నటి ఈ విధంగా మాట్లాడింది. తనుకు అనారోగ్యంగా ఉందని, పలువురు చంపేస్తామని బెదరిస్తున్నందున తాను అజ్ఞాతంలో ఉన్నానని వివరించింది. మూడు నాలుగు రోజుల్లో తాను బెంగళూరు వస్తానని రాసలీలల వీడియోలో ఉన్న స్యాండిల్ వుడ్ నటి చెప్పింది.
10 మంది వేధించారు, నాశనం చేశారు
నన్ను వేధింపులకు గురి చేసిన 10 మంది వారి స్వంత లాభం కోసం రాసలీలల వీడియో తీసి నాజీవితం నాశనం చేశారని, నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికీ రాకూడదని స్యాండిల్ వుడ్ నటి వీడియోలో విలపించారు. తాను బెంగళూరు వచ్చిన తరువాత మీడియా సమావేశంలో అన్ని విషయాలు బయటకు వెళ్లడిస్తానని ఆమె చెప్పారు.
ఎవ్వరినీ వదలిపెట్టను !
నాకు ఈ పరిస్థితి కల్పించిన 10 మంది మీద పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెడుతానని స్యాండిల్ వుడ్ నటి వీడియోలో హెచ్చరించారు. నేను ఆత్మహత్యాయత్నం చేసిన సమయంలో ఏమైనా చట్టపరంగా పోరాటం చెయ్యాలని, ఆత్మహత్య చేసుకోరాదని నా కుటుంబ సభ్యులు అండగా నిలిచారని గుర్తు చేశారు.
నటి ఆత్మహత్యాయత్నం
నా జీవితం నాశనం చేసిన ఆ 10 మంది మీద చట్టపరంగా కేసు నమోదు చేస్తానని స్యాండిల్ వుడ్ నటి వీడియోలో వివరించారు. రాసలీలల వీడియో మీడియాలో ప్రసారం అయిన తరువాత స్యాండిల్ వుడ్ నటి శివమొగ్గ జిల్లాలో నిద్రమాత్రలు సేవించి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.
రూ. 5 కోట్ల కోసం బ్లాక్ మెయిల్ !
దయానంద స్వామీజీ, స్యాండిల్ వుడ్ నటి రాసలీలల వీడియో మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మఠం భక్తులు ఆందోళన చెయ్యడంతో దయానంద స్వామీజీని మఠం నుంచి శాస్వతంగా బహిష్కరించారు. రూ. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశారని, రూ. 50 లక్షలు ఇచ్చినా సీడీని కావాలనే విడుదల చేశారని దయానంద స్వామీజీ ఇటీవల ఆరోపించారు.