దక్షిణ భారతదేశం టార్గెట్, బెంగళూరులో బీజేపీ హెడ్ క్వాటర్స్, ఆంధ్రా, తెలంగాణ!
బెంగళూరు/న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఎక్కువ స్థాలు కైవసం చేసుకుని కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో అధిక లోక్ సభ స్థానాలల్లో విజయం సాధించాలని ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అమిత్ షా పక్కా ప్లాన్ వేస్తున్నారు.
బీజేపీ కార్యాలయం
ఇప్పటి వరకు లోక్ సభ, శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలోని పెద్దలు విడుదల చేసేవారు. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ అభ్యర్థులు పోటీ చెయ్యాలన్నా ఢిల్లీ పెద్దల నిర్ణయం కోసం ఎదురు చూసేవారు.
దక్షిణ భారతదేశం
కర్ణాటకలో బీజేపీకి ఒక రకమైన బలం ఉంది. దక్షిణ భారతదేశంలో పాగా వెయ్యాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కార్యకలాపాలు చూసుకోవడానికి బెంగళూరు కేంద్రంగా అమిత్ షా ఓ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు.
ఐదు రాష్ట్రాలు
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ కార్యాకలాపాలు బెంగళూరు కేంద్రంగా జరగనున్నాయి. అమిత్ షా, ఆయన టీం సభ్యులు ఇక బెంగళూరు నుంచి దక్షిణ భారతదేశంలో లోక్ సభ ఎన్నికల కార్యకలాపాలు నిర్వహించడానికి రంగం సిద్దం చేశారు.
అదే ఇంటిలో ఆఫీస్
2018 కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా అమిత్ షా బెంగళూరు నగరంలోని సదాశివనగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అదే ఇంటి నుంచి లోక్ సభ ఎన్నికల కార్యకలాపాలు నిర్వహించాలని అమిత్ షా నిర్ణయించారు. ఇప్పటికే అమిత్ షాకు అత్యంత నమ్మకస్తులు ముగ్గురు బెంగళూరు చేరుకుని సదాశివనగర్ ఇంటిలో మకాం వేసి నిత్యం ఢిల్లీతో సంప్రదింపులు జరుపుతున్నారు.
కర్ణాటకలో 80 శాతం
కర్ణాటకలో మొత్తం 28 లోక్ సభ నియోజక వర్గాలు ఉన్నాయి. వాటిలో 23 లోక్ సభ నియోజక వర్గాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని అమిత్ షా నిర్ణయించారు. ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులో వీలైనన్ని ఓట్లు చీల్చాలని బెంగళూరు కేంద్రంగా బీజేపీ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.