Bengaluru Rent Crisis:ఐటీ ఉద్యోగులకు మరో షాక్..ఇంటి ఓనర్ల కొత్త డిమాండ్లు..!!
ఐటీ ఉద్యోగాల కోసం వేలాది మంది తెలుగు యువత కలల నగరంగా భావించే బెంగళూరు.. ఇప్పుడు అద్దె ఇళ్ల విషయంలో కొత్త తలనొప్పిగా మారుతోంది. భారీ రెంట్లు, 10 నెలల అడ్వాన్స్లు, ప్రతి ఏడాది పెరుగుతున్న అద్దెలతో ఇప్పటికే సతమతమవుతున్న ఉద్యోగులకు ఇప్పుడు మరో కొత్త సమస్య ఎదురవుతోంది. "నా కొడుకు విదేశాల నుంచి వస్తున్నాడు", "ఇల్లు అమ్మేస్తున్నాం", "ఫ్యామిలీ షిఫ్ట్ అవుతోంది" అంటూ ఇంటి యజమానులు అద్దెదారులను అకస్మాత్తుగా ఇళ్లు ఖాళీ చేయమంటున్నారన్న ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరుకు వెళ్లి పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు, స్టార్టప్ యువత, విద్యార్థులు ఈ పరిస్థితితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే నెల జీతంలో పెద్ద మొత్తంలో అద్దె చెల్లిస్తుండగా.. ఇప్పుడు ఇంటి యజమానుల కొత్త డిమాండ్లు, వింత కారణాలు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

కొడుకు వస్తున్నాడు,ఇల్లు అమ్మేస్తున్నాం..ఇవే కొత్త కారణాలా?
బెంగళూరులో అద్దె ఇళ్ల మార్కెట్ ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటుంది. ముఖ్యంగా వైట్ఫీల్డ్, మారథహళ్లి, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, బెల్లందూర్, కోరమంగల వంటి ఐటీ హబ్ ప్రాంతాల్లో ఇంటి అద్దెలు లేదా బాడుగలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత అద్దెదారులను పంపించి కొత్తవారికి ఎక్కువ అద్దెకు ఇళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కొందరు ఇంటి యజమానులు కొత్త కొత్త కారణాలు చెబుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొంతమంది అద్దెదారుల మాటల్లో.. "ఇంటి యజమాని కొడుకు అమెరికా నుంచి వస్తున్నాడు", "సోదరుడు ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నాడు", "ఇల్లు అమ్మాలని ప్లాన్ చేస్తున్నాం" వంటి కారణాలు చెప్పి ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారని చెబుతున్నారు. కానీ కొద్ది రోజులకే అదే ఇల్లు భారీ రెంట్తో మళ్లీ మార్కెట్లో కనిపిస్తోందని వాపోతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బెంగళూరు రెంట్ స్టోరీలు
ఇటీవల ఇన్స్టాగ్రామ్లో దిశాకా అనే యువతి పెట్టిన పోస్ట్ పెద్ద చర్చకు దారితీసింది.తన ఇంటి యజమాని మొదట "ఫ్యామిలీ సభ్యుడు వస్తున్నాడు" అని చెప్పి ఇల్లు ఖాళీ చేయమన్నాడని.. కానీ తర్వాత నెలకు రూ.4 వేల అద్దె పెంచేందుకు ఇదంతా ఓనర్ ఆడిన డ్రామా అని తెలిసిందని ఆమె పేర్కొంది.ఈ పోస్ట్కు వందలాది మంది స్పందిస్తూ తామూ ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొన్నామని కామెంట్లు చేస్తున్నారు.
కొంతమంది తెలుగు ఉద్యోగులు చెబుతున్నదేమిటంటే.. "లీజ్ అగ్రిమెంట్ ఇంకా ముగియకముందే ఒత్తిడి పెడుతున్నారు.ఎక్కువ రెంట్ ఇచ్చే కొత్త టెనెంట్లు దొరికితే పాతవారిని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు" అని ఆరోపిస్తున్నారు.
తెలుగు ఉద్యోగులపై భారీ ప్రభావం
బెంగళూరులో నివసిస్తున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారి సంఖ్య చాలా ఎక్కువ. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతి ప్రాంతాల నుంచి వెళ్లిన ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి యజమానుల ఆకస్మిక నిర్ణయాలు వారికి ఆర్థికంగానే కాదు మానసికంగా కూడా ఇబ్బందులు కలిగిస్తున్నాయి.కొత్త ఇల్లు వెతకడం, అడ్వాన్స్ చెల్లించడం, బ్రోకరేజ్ ఇవ్వడం, ఆఫీస్కు దగ్గరగా ఇల్లు దొరకడం.. ఇవన్నీ బెంగళూరులో పెద్ద సవాలుగా మారిపోయాయి. ఒకసారి షిఫ్ట్ కావాలంటే లక్షల రూపాయల ఖర్చు అవుతోందని ఉద్యోగులు చెబుతున్నారు.
చట్టపరంగా హక్కు ఉన్నా..
చట్టపరంగా చూస్తే ఇంటి యజమానులకు తమ ఆస్తిపై హక్కు ఉంటుంది.అవసరమైతే ఇంటిని తిరిగి తీసుకునే హక్కు కూడా ఉంది.కానీ తప్పుడు కారణాలు చెప్పి అద్దెదారులను బయటకు పంపించడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ముఖ్యంగా ఇప్పటికే రెంట్ల భారంతో ఇబ్బంది పడుతున్న నగరంలో ఇలాంటి పరిస్థితులు మరింత అసంతృప్తికి దారితీస్తున్నాయి.
సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరులో ఇల్లు అద్దెకు ఉండటం అనేది రోజురోజుకూ ఒక పెద్ద ప్రహసనంగా మారుతోంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లి అక్కడ నివసిస్తున్న వారు ఇలాంటి ఓనర్ల బారిన పడకుండా ఉండాలంటే.. హౌస్ అగ్రిమెంట్ చేసుకునేటప్పుడే 'నోటీస్ పీరియడ్', 'లాక్-ఇన్ పీరియడ్' నిబంధనలను పక్కాగా రాసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే.. ఎప్పుడు ఏ విచిత్ర కారణంతో ఇల్లు ఖాళీ చేయమంటారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అద్దె ఇళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం అవసరమని, రెంట్ నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని నగర వాసులు కోరుతున్నారు.














Click it and Unblock the Notifications