కిడ్నాప్, నగ్న ఫొటోలు తీశారు: యువతి ఆత్మహత్య
బెంగళూరు: ఇద్దరు యువకులు వారి స్నేహితులతో కలిసి ఓ 15ఏళ్ల యువతిని కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెను బంధించి ఆమె నగ్న ఫొటోలు తీశారు. ఆ ఫొటోలతో వేధింపులకు దిగడంతో సదరు యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.
బాధిత పాఠశాల విద్యార్థిని ఇంటికి వెళుతున్న సమయంలో నిందితులు ఆమెను కిడ్నాప్ చేశారు. బాధితురాలి ఆత్మహత్యతో వెలుగుచూసిన ఈ ఘటనతో పోలీసులు కేసు నమోదు చేసి.. ఇద్దరు ప్రధాన నిందితులు కృష్ణమూర్తి, మోహన్లను అరెస్ట్ చేశారు.
పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు చేపట్టారు. తన గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న బాధిత యువతి.. తన సూసైడ్ నోట్లో నిందితుల దుశ్చర్యను వివరించింది.
తన ఆత్మహత్యకు కృష్ణమూర్తి, మోహన్లే కారణమని పేర్కొంది. సోమవారం తాను పాఠశాల నుంచి వస్తున్న సమయంలో ఈ ఇద్దరు, తమ స్నేహితులతో తనను కిడ్నాప్ చేశారని తెలిపింది. అనంతరం తనను నగ్నం చేసి ఫొటోలు తీశారని పేర్కొంది.
ఆ ఫొటోలతో తనను వేధింపులకు గురి చేశారని.. దీంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని తెలిపింది. తనకు, తన కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నట్లు తన సూసైడ్ లేఖలో బాధిత విద్యార్థిని పేర్కొంది.