వినలేని డ్రైవర్.. అంధురాలైన యువతి. నిశ్శబ్ద ప్రయాణంలో మానవత్వం
కొన్నిసార్లు మాటలు అవసరం లేదు.. కేవలం మనసులు కలిస్తే చాలు. కళ్లు లేకపోయినా, వినికిడి శక్తి లేకపోయినా.. తోటి మనిషి అవసరాన్ని గుర్తించే 'మానవత్వం' ఉంటే ఎంతటి అడ్డంకినైనా దాటవచ్చు అని నిరూపించింది ఈ సంఘటన. వైకల్యాన్ని అడ్డుగోడగా కాకుండా, అవగాహనకు వారధిగా మార్చుకున్న ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఈ ప్రయాణం ఇప్పుడు నెటిజన్ల కళ్లను చెమర్చిస్తోంది.
గ్రేల్మేకర్ ఇన్నోవేషన్స్ సహ-వ్యవస్థాపకురాలు ఐశ్వర్య టీవీ పిళ్లై ఇటీవలే తనకు ఎదురైన ఒక అపురూపమైన ప్రయాణ అనుభవాన్ని పంచుకున్నారు. అది ఒక సాధారణ ఉబెర్ రైడ్ కావాల్సింది. కానీ, అక్కడ ఒక చిన్న సమస్య ఉంది. ఐశ్వర్యకి చూపు 10 శాతం మాత్రమే కనిపిస్తుంది. ఆమెను తీసుకెళ్లాల్సిన డ్రైవర్ వినికిడి లోపం ఉన్న వ్యక్తి. "వినలేని డ్రైవర్, చూడలేని ప్రయాణీకురాలు.. ఈ ప్రయాణం ఎలా సాగుతుంది?" అన్న సందేహం మొదట ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. కానీ, ఆ నిశ్శబ్ద ప్రయాణంలో ఆమె ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్చుకున్నారు.

సందేహం నుంచి సాహసం వైపు..
క్యాబ్ బుక్ చేశాక డ్రైవర్కు వినికిడి లోపం ఉందని మెసేజ్ వచ్చింది. "నేను అంధురాలిని కదా.. మమ్మల్ని మేము ఎలా అర్థం చేసుకోగలం?" అన్న ఆలోచనతో మొదట రైడ్ క్యాన్సిల్ చేయాలనుకున్నారు ఐశ్వర్య. కానీ, భయం కంటే ఆసక్తి ఆమెను ముందుకు నడిపించింది. "చూద్దాం ఏం జరుగుతుందో.." అనుకుంటూ ఆమె ఆ క్యాబ్ ఎక్కారు. మాటలు లేని చోట ఆమె తన స్మార్ట్ఫోన్ను కమ్యూనికేషన్ ఆయుధంగా మార్చుకున్నారు. వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) నుంచి ప్రతి చిన్న సూచనను ఆమె మెసేజ్ రూపంలో డ్రైవర్కు పంపారు. ( ఓ మిషన్ సాయంతో ఫోన్ లోని చిన్న అక్షరాలను చూడగలరు)
భాష లేని భావం..
మాటలు లేకపోయినా, డ్రైవర్ ఆమె అవసరాలను చిటికెలో అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా అంధురాలు కావడంతో, గమ్యస్థానానికి చేరుకున్నాక "దగ్గరలో ఎక్కడో దింపేస్తే" ఆమె ఇబ్బంది పడుతుందని ఐశ్వర్య భయపడ్డారు. అందుకే "నన్ను సరిగ్గా గేటు ముందే దింపండి" అని సందేశం పంపారు. డ్రైవర్ ఆ సందేశాన్ని చదువుకుని, ఆమె కోరుకున్న చోటే కారును నిలిపారు. కానీ, అక్కడితో ఆయన బాధ్యత ముగిసిపోలేదు.
కదిలించిన ఆఖరి నిమిషం..
కారు ఆగింది.. డ్రైవర్ బయటకు వెళ్లి ఎవరినో పిలుస్తున్నారు. ఐశ్వర్యకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత ఆయన ఒక సెక్యూరిటీ గార్డును వెంటబెట్టుకుని కారు దగ్గరకు వచ్చారు. ఆ డ్రైవర్ స్వయంగా గార్డుకు సైగలు చేస్తూ.. ఐశ్వర్యను సురక్షితంగా లోపలికి తీసుకెళ్లాలని సూచించారు. ఆ మూగ సైగల్లో ఎంతటి శ్రద్ధ, ఎంతటి మానవత్వం ఉందో గమనించిన ఐశ్వర్య మనసు చలించిపోయింది. ఎటువంటి మాటల సంభాషణ లేకుండానే, ఇద్దరు వ్యక్తులు తమ పరిమితులను దాటి ఒకరినొకరు అర్థం చేసుకున్న తీరు అద్భుతం.
నెటిజన్ల కన్నీటి పర్యంతం..
ఈ సంఘటనను ఐశ్వర్య లింక్డ్ఇన్లో పంచుకోగానే వేల సంఖ్యలో స్పందనలు వచ్చాయి. "ఇది చదువుతుంటే నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి" అని ఒకరు వ్యాఖ్యానిస్తే, "వైకల్యం అనేది శరీరానికి మాత్రమే, మనసుకి కాదు అని ఈ డ్రైవర్ నిరూపించారు" అని మరొకరు రాశారు. సాంకేతికత అనేది కేవలం సౌకర్యం కోసం మాత్రమే కాదు, ఇలాంటి విభిన్న సామర్థ్యాలు ఉన్న వ్యక్తుల మధ్య వారధిలా పనిచేయాలని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.
మాటలు లేని ఆ నిశ్శబ్ద ప్రయాణం, ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. తోటి మనిషిని అర్థం చేసుకోవడానికి కావాల్సింది చెవులు, కళ్లు కాదు.. కేవలం స్పందించే హృదయం అని ఐశ్వర్య అనుభవం చాటిచెప్పింది.












Click it and Unblock the Notifications