నేడే భారత్ బంద్: ఉదయం 6 నుంచి నిలిచిపోనున్న రోడ్డు, రైలు రవాణా, మార్కెట్లూ..
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు పిలుపునిచ్చిన క్రమంలో శుక్రవారం భారత్ బంద్ జరగనుంది. దేశ వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటలపాటు ఈ బంద్ కొనసాగుతుందని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేతలు వెల్లడించారు.
మార్కెట్లు, షాపింగ్ మాల్స్ కూడా మూసివేయాలని నిర్ణయించారు. రోడ్డు రవాణా, రైలు సర్వీసులను బ్లాక్ చేయాలని రైతు నేతలు నిర్ణయించారు. దీంతో దేశంలో పలు ప్రాంతాల్లో రైలు, రోడ్డు రవాణా సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రధానంగా పంజాబ్, హర్యానా, పశ్చిమఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఈ బంద్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
బంద్ను శాంతియుతంగా నిర్వహించి తమకు మద్దతుగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రైతు నేతలు. అంబులెన్స్, అత్యవసర సేవలు మినహా అన్నింటినీ అడ్డుకుంటామని చెప్పారు. కాగా, ఈ రైతు నేతలు ఇచ్చిన 12 గంటల బంద్ పిలుపునకు కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, ఆప్, టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ సహా పలు రాజకీయా పార్టీలు కూడా మద్దతు పలికాయి.
ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో సాధారణ జనజీవనంపై ఈ బంద్ ప్రభావం పడనుంది. తమ బంద్ పిలుపునకు పలు రైతు సంఘాలతోపాటు కార్మిక, విద్యార్థి సంఘాలు, బార్ అసోసియేషన్లు, రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయని రైతు నేత దర్శన్ పాల్ తెలిపారు. బంద్ ను విజయవంతం చేయాలని రైతు నేత రాకేష్ టికాయత్ ఇప్పటికే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు నెలలుగా వేలాది మంది పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతు నేతలు ఇటీవల రైలు రోకో కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా, సంపూర్ణ భారత్ బంద్ చేపడుతున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానొకిస్తే భారత్ బంద్కు పలు రాజకీయ పార్టీలతోపాటు ఏపీ ప్రభుత్వం మద్దతు ప్రకటించడంతో ఆ రాష్ట్రంలో బంద్ ప్రభావం కనిపించనుంది. మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులను డీపోలకే పరిమితం చేస్తామని, ఆ తర్వాత యధావిధిగా బస్సులు నడుస్తాయని ఏపీ మంత్రి ఒకరు ఇప్పటికే తెలిపారు. ఇక తెలంగాణలో భారత్ బంద్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చు.