కోవాక్సిన్ రెండో దశ ట్రయల్స్: హైదరాబాద్ భారత్ బయోటెక్కు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ/హైదరాబాద్: కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ 'కోవాక్సిన్'ను అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్కు కీలక అనుమతులు లభించాయి. రెండో దశ ట్రయల్స్ చేసేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు ఇచ్చింది.
తొలి దశ ట్రయల్స్ విజయవంతం..
ఇప్పటికే తొలి దశ ట్రయల్స్ విజయవంతంగా నిర్వహించగా.. ఆశాజనకంగా ఫలితాలు రావడంతో సెప్టెంబర్ 7 నుంచి దేశ వ్యాప్తంగా రెండో దశ ట్రయల్స్ ప్రారంభించేందుకు అనుమతి లభించింది. రెండో దశ పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఈ సంస్థ ప్రకటించింది.
180 రోజుల పర్యవేక్షణ..
దేశ వ్యాప్తంగా భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఎంపిక చేసిన 12 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనుంది. తొలి విడత పరీక్షల్లో 50 మంది వాలంటీర్లకు రెండు డోసుల వంతున టీకాను అందించిన విషయం తెలిసిందే. తొలి డోసు ఇచ్చిన 14 రోజుల తర్వాత అందరికీ బూస్టర్ డోసు అందించారు. ఆ తర్వాత వారి రక్త నమూనాలను భారత్ బయోటెక్ ల్యాబ్ తోపాటు పుణెలోని వైరాలజీ లేబోరేటరీ, ఐసీఎంఆర్ కు పంపారు. ఈ 50 మంది ఆరోగ్య పరిస్థితిని సుమారు 180 రోజులపాటు పర్యవేక్షించనున్నారు.
ఆ తర్వాతే మూడో దశ..
రెండో దశలో భాగంగా నిమ్స్లో 100 మందిని వాలంటీర్లుగా ఎంపిక చేసినట్లు తెలిసింది. వారి నుంచి సేకరించిన రక్తనమూనాలను ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ఢిల్లీలోని ల్యాబ్కు పంపిస్తారు. వాటి ఆధారంగా ఉన్నతాధికారులు ఎంపిక చేసిన వాలంటీర్లకు టీకాలు వేస్తారు. ఆ తర్వాత మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తారు. కాగా, దేశంలో సుమారు ఏడు యాంటీ కరోనా వ్యాక్సిన్లు వివిధ దశలలో అభివృద్ధి చెందుతున్నాయి. రెండు వ్యాక్సికన్లకు మాత్రం హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు డ్రగ్ రెగ్యూలేటర్స్ నుంచి అనుమతి లభించింది.
Recommended Video