రహదారి: వాజ్పేయి 'స్వర్ణ చతుర్భుజి', మోడీ 'భారతమాల' ఎంతో ప్రతిష్టాత్మకం
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి స్వర్ణ చతుర్భుజి (గోల్డెన్ క్వాడ్రీలేటరల్) ప్రారంభిస్తే, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ భారతదేశ తూర్పు పడమరలను కలుపుతూ 'భారతమాల' పేరుతో రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ప్రధాని మోడీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ కార్యక్రమమే 'భారతమాల'. భారతదేశం యొక్క తూర్పు, పడమరలను అనుసంధానం చేస్తూ నిర్మించనున్న రహదారి. దేశంలో మౌలిక వసతులకు సంబంధించి అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన రాష్ట్రాలను కలుపుతూ గుజరాత్ నుంచి మిజోరం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు.
సుమారు 5,300 కిలోమీటర్ల మేర కొత్తగా నిర్మాణం చేయనున్న ఈ రహదారి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం వేసిన అంచనా వ్యయం రూ. 14 వేల కోట్లు. మహారాష్ట్ర నుంచి బెంగాల్ వరకు నిర్మించనున్న ఈ రహదారి భారతదేశానికి వేసిన దండలా కనిపించే అవకాశం ఉండటంతో దీనికి 'భారతమాల' అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించనున్న ఈ ప్రాజెక్టు గుజరాత్ నుంచి ప్రారంభించి రాజస్ధాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ మణిపూర్ల మీదగా మిజోరం వరకు రోడ్డు రవాణా సౌకర్యం కల్పించనున్నారు.
ఇటీవల కాలంలో అంతర్జాతీయ సరిహద్దుల్లో చైనా బాగా విస్తరిస్తుండటంతో, సరిహద్దు ప్రాంతాలకు, మిలటరీ అవసరాలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే పథకంలో బాగంగా ఈ వ్యూహాత్మక రచన చేశారు. అంతే కాకుండా సరిహద్దు రాష్ట్రాలతో వాణిజ్యం విస్తృతమయ్యే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టుని ఈ సంవత్సరం చివరలో ప్రారంభించి, ఐదేళ్లలో పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని కేంద్ర రోడ్లు సెక్రటరీ విజయ్ చిబ్బిర్ తెలిపారు. ప్రస్తుతానికి పర్యావరణ అనుమతులు, భూసేకరణే ప్రధాన అడ్డంకిగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
భరత్ మాల రహదారికి మహారాష్ట్ర నుంచి బెంగాల్ వరకు ఉన్న తీర ప్రాంతాల రహదారులతో రైలు మరియు రోడ్డుని అనుసంధానం చేసేందుకు మరో ప్రతిష్టాత్మక పథకం ‘సాగరమాల' కూడా చేపట్టేందుకు రంగం సిద్ధమైంది.












Click it and Unblock the Notifications