దీదీ ఉప ఎన్నిక ప్రచారం ఆరంభం -10న నామినేషన్ : పోటీకి దూరంగా కాంగ్రెస్..!!
పశ్చిమ బెంగాల్ లో వరుసగా మూడో సారి అధికారంలోకి వచ్చిన మమతా..ఇప్పుడు ఉప ఎన్నికల్లో తల పడాల్సి వచ్చింది. తాజాగా జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాటి సవాళ్లకు ధీటుగా స్పందించి నందిగ్రామ్ నుంచి పోటీకి దిగారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో పూర్తి మెజార్టీతో అధికారంలోకి మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ వచ్చినా..మమత మాత్రం గెలవలేదు. దీంతో..ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మమతా బెనర్జీ ఆరు నెలల్లోగా చట్ట సభకు ఎన్నిక కావాల్సి ఉంది.
మమతా ఎన్నికల ప్రచారం ఆరంభం
అయితే, కరోనా కారణంగా ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ముందుకు రాకుంటే..ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఉత్కంఠ చర్చ కొనసాగింది. సడన్ గా ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్ లోని భవానీ పూర్ తో పాటుగా ఒడిశాలోని రెండు సీట్లకు ఉప ఎన్నికలు ప్రకటించింది. దీంతో..భవానీ పూర్ నుంచి పోటీకి సిద్దమైన మమతా బెనర్జీ ఈ రోజు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భవనీపూర్ నుంచి మమతాబెనర్జీ స్వయంగా పోటీ చేస్తున్నారు.
బీజేపీ కుట్రతోనే ఓడాను
టీఎంసీ మద్దతుదారులను ఉద్దేశించి ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ, మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ పాలనను ఎవరు విమర్శించినా వారిపై వేధింపులకు దిగుతున్నారని అన్నారు. ఉప ఎన్నికల తేదీలు ప్రకటించగానే ఈడీ, సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీలు టీఎంసీ నేతలకు సమన్లు పంపినట్టు చెప్పారు. బీజేపీ కుట్ర కారణంగానే నందిగ్రామ్లో తాను ఓటమి చవిచూశానని, ఆ కారణంగానే తాను మళ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నానని చెప్పుకొచ్చారు.
10న మమత నామినేషన్
ఈ నెల 10న దుర్గా మాతకు పూజ చేసి మమత తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. మమతా కాగా, భవానీపూర్ ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీపై తమ అభ్యర్థిని నిలబెట్టడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు టీఎంసీపై పోటీ కానీ, మమతకు వ్యతిరేకంగా ప్రచారం కానీ కాంగ్రెస్ చేపట్టడం లేదని బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి తెలిపారు. మరోవైపు, భవనీపూర్ నియోజకవర్గం నుంచి సీపీఎం నేత శ్రీజిబ్ బిస్వాస్ను నిలబెడుతున్నట్టు లెఫ్ట్ ఫ్రంట్ కమిటీ ప్రకటించింది.
పోటీకి కాంగ్రెస్ దూరం..అభ్యర్ధిని ప్రకటించని బీజేపీ
భవానీపూర్ నుంచి తమ పార్టీ అభ్యర్థిని ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని బీజేపీ తెలిపింది. అయితే, ఈ నియోకవర్గం పూర్తిగా టీఎంసీకి అనుకూల ప్రాంతం కావటం మమతకు కలిసొచ్చే అంశం. ఇదే నియోజకవర్గ పరిధిలో మమత నివాసం ఉంటున్నారు. ఇక, బీజేపీ శాసనసభా పక్ష నేత సువేందు అధికారి ఇక్కడ కూడా బీజేపీ నే గెలుస్తుందని..మమతను ఓడిస్తామని చెబుతున్నారు. ఇప్పుడు మమత ఎన్నికల ప్రచారం ప్రారంభించటంతో.. బీజేపీ తమ అభ్యర్ధిని ప్రకటించాల్సి ఉంది.