భీమ్ ఆర్మీ చీఫ్పై కాల్పులు- తీవ్ర ఉద్రిక్తత
లక్నో: ఉత్తరప్రదేశ్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు ఆయనకు అత్యవసర చికిత్సను అందిస్తోన్నారు.
ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో కొద్దిసేపటి కిందటే ఈ ఘటన సంభవించింది. కారులో వెళ్తోన్న చంద్రశేఖర్ ఆజాద్పపై గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కాల్పులకు తెగబడ్డాడు. ఆయన శరీరంలో రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. దుండగులు కారులో వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. భీమ్ ఆర్మీ కార్యకర్త ఇంట్లో ఏర్పాటైన ఓ కార్యక్రమానికి కాన్వాయ్లో బయలుదేరి వెళ్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

చంద్రశేఖర్ ఆజాద్ కూర్చున్న టయోటా ఫార్చునర్ కారును వెంబడించిన దుండగుడు.. వెనుక వైపు నుంచి కాల్పులు జరిపాడు. మొత్తంగా నాలుగు రౌండ్ల పాటు కాల్పులు జరిపినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలో ఒక బుల్లెట్ ఆయన వీపులో దిగబడింది. మరో బుల్లెట్ పక్కటెముకలను గాయపరిచింది.
కాల్పులు జరిగిన సమయంలో ఫార్చునర్ కారులో మొత్తం అయిదుమంది ఉన్నారు. వారిలో ఆజాద్ సోదరుడు కూడా ఉన్నారు. రక్తమోడుతూ కారులోనే కుప్పకూలిన ఆజాద్ను హుటాహుటిన సహరాన్పూర్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లకు ఆయనకు అత్యవసర వైద్య చికిత్సను అందిస్తోన్నారు. ప్రస్తుతానికి ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్లు శరీరం నుంచి రెండు బుల్లెట్లను తొలగించినట్లు సమాచారం.
ఈ ఘటన పట్ల భీమ్ ఆర్మీ ఆగ్రహావేశాలను వ్యక్తం చేసింది. దీన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. సమాచారం తెలిసిన వెంటనే భీమ్ ఆర్మీ కార్యకర్తలు, ఆజాద్ అభిమానులు పెద్ద ఎత్తున సహరాన్ పూర్ ఆసుపత్రికి చేరుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ ఘటనతో సహరాన్పూర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోన్నారు. ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున భీమ్ ఆర్మీ నాయకులు, కార్యకర్తలు చేరుకుంటోండటంతో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరింపజేశారు.












Click it and Unblock the Notifications