Viral video: కదులుతున్న జీపుపై క్రిమినల్స్ చిందులు, మరో కారులో వీడియో తీస్తూ..
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధానిలో నేరగాళ్లు రెచ్చిపోతున్నాయి. ముఠాలుగా ఏర్పడి రోడ్లపై విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా, భోపాల్ రోడ్లపై ఓ గ్యాంగ్ భయానక ప్రదర్శనలకు దిగింది. ఓ కారులో జుబేర్ మౌలానా అనే నేరస్తుడు కదులుతున్న జీపుపైకి ఎక్కి చిందులు వేశాడు. దీనికి అతడి గ్యాంగ్ కేకలు వేస్తూ అతడ్ని ప్రోత్సహిస్తున్నారు.
జీపుపై గ్యాంగ్ చిందులను మరో కారులో వీడియోలో తీశారు. ఆ కారు రహదారిపై రివర్స్లో వెళుతుండటం గమనార్హం. శుక్రవారం రాత్రి సన్నీ మాలిక్ అనే నేరస్తుడి పుట్టిన రోజు వేడుకలను గాంధీనగర్లో జరుపుకున్నారు. ఆ తర్వాత ఇలా ఆ నేరస్తుల ముఠా రెండు వాహనాల్లో రహదారిపై బీభత్సం సృష్టించింది. అంతేగాక, వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
మౌలానా అనుచరుడు ఒకరు నిమిషంపాటు ఉన్న ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పెద్ద మ్యూజిక్ పెట్టుకుని జీపు, కారులో చిందులు వేశారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరి వ్యవహారంతో రోడ్డుపై వెళుతున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
#Viral Goons perform stunts on Bhopal roads 😲🤯pic.twitter.com/3r05uraujJ
— REPORTER INDIA (@ReporterIndia_) December 12, 2022
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు. ఆ వీడియోలను పరిశీలించి త్వరలోనే కేసు నమోదు చేస్తామని చెప్పారు. మధ్యప్రదేశ్లో ప్రజలను భయపెట్టేవారికి చోటు లేదు. జుబేర్ లాంటి వ్యక్తులు తెలుసుకుంటే మంచిదని హోంమంత్రి హెచ్చరించారు.
కాగా, జుబేర్ మౌలానాపై ఇప్పటికే 65 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఇందులో 44 కేసులు తీవ్రమైనవని వెల్లడించారు. పోలీసులపై కూడా దాడి అతడు పలుమార్లు తప్పించుకున్నట్లు చెప్పారు.