భూకంపం వచ్చేసింది, అద్భుతం: రాహుల్ ప్రసంగంపై థరూర్ ప్రశంసలు
న్యూఢిల్లీ: లోక్సభలో శుక్రవారం అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అద్భుత ప్రదర్శన చేశారని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ప్రశంసించారు. రాహుల్ చాలా బాగా మాట్లాడారని అన్నారు. ఆయనది గేమ్ ఛేంజింగ్ స్పీచ్ అని ప్రశంసించారు.
ప్రభుత్వంపై విమర్శలు చేయడం, హామీల గురించి నిలదీయడంతో పాటు అనుకోని ఆలింగనంతో తన ప్రసంగాన్ని ముగించి భారతీయ జనతా పార్టీకి నోట మాట రాకుండా చేశారని థరూర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
'భూకంప్ ఆగయా' అనే హ్యాష్ట్యాగ్ను కూడా శశిథరూర్ జత చేశారు. గతంలో రాహుల్ గాంధీ తనను లోక్సభలో మాట్లాడనివ్వడం లేదని మాట్లాడితే భూకంపం వస్తుందని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు 'భూకంప్ ఆనే వాలా హై' అనే హ్యాష్ట్యాగ్తో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దాన్ని తిప్పి కొడుతూ శశిథరూర్ రాహుల్ ప్రసంగం అనంతరం భూకంపం వచ్చిందని వ్యాఖ్యానించారు.
What an astonishing performance by @RahulGandhi. It was a game-changing speech, tearing apart the Govt ’s claims & ending with that unscripted hug that has literally taken the BJP’s breath away #BhukampAaGaya
— Shashi Tharoor (@ShashiTharoor) July 20, 2018
ఇది ఇలా ఉండగా, మరో కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ కూడా రాహుల్ ప్రసంగాన్ని మెచ్చుకున్నారు. సాధారణ ప్రజలు, రైతులు, వ్యాపారులు, మహిళలకు సంబంధించిన అంశాల గురించి రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రస్తావించారని అన్నారు. మహిళల రక్షణ గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడారని, ఎన్డీయే పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వెల్లడించారు.