లిక్కర్ జాతర.. ఒక్క కస్టమర్ ఇంత బిల్లా..? రెచ్చిపోయి కొంటున్న మందుబాబులు..
కర్ణాటక,ఆంధ్రప్రదేశ్లలో సోమవారం(మే 4) వైన్ షాపుల ముందు జనం జాతరను తలపించారు. లాక్ డౌన్ కారణంగా నెలన్నర రోజుల పాటు చుక్క లేక నీరసించిన మందుబాబులు.. సోమవారం ఎక్కడ లేని ఉత్సాహంతో వైన్ షాపుల ముందు వాలిపోయారు. కిలోమీటర్ల క్యూ లైన్లో గంటల పాటు ఓపిగ్గా నిలుచుని మద్యం కొనుగోలు చేశారు. అయితే కొంతమంది అత్యుత్సాహంతో భారీగా మద్యాన్ని కొనుగోలు చేశారు. కర్ణాటకలోని బెంగళూరులో అయితే ఓ కస్టమర్ ఏకంగా యాభై వేల రూపాయల మద్యం కొనుగోలు చేయడం గమనార్హం.
Recommended Video
ఎంత మద్యం కొనుగోలు చేశాడంటే..
సౌత్ బెంగళూరులోని వనిల్లా స్పిరిట్ జోన్ నుంచి ఓ కస్టమర్ రూ.52,800 విలువ చేసే మద్యాన్ని కొనుగోలు చేశాడు. దాదాపు 13.5లీటర్ల లిక్కర్,35లీటర్ల బీర్ను అతను కొనుగోలు చేశాడు. నిబంధనల ప్రకారం.. రిటైల్ వ్యాపారులు ఒక కస్టమర్కు ఒకరోజు 2.6లీటర్ల లిక్కర్(భారత్లో తయారయ్యే ఫారిన్ లిక్కర్),18లీటర్ల బీర్కు మించి అమ్మకూడదు.
సోషల్ మీడియాలో వైరల్..
ఈ భారీ మద్యం కొనుగోలుకు సంబంధించిన బిల్లు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో కర్ణాటక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది. దీనిపై సదరు వైన్ షాపు యజమానిని అధికారులు ప్రశ్నించారు. అయితే అది ఒక కస్టమర్కు సంబంధించిన బిల్లు కాదని.. 8మంది వ్యక్తులు కలిసి లిక్కర్ తీసుకున్నారని ఆ యజమాని చెప్పారు. కానీ బిల్లు మాత్రం ఒకే కార్డుపై చెల్లించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నామని.. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ డీసీ గిరి తెలిపారు.
ఇదొక్కటే కాదు..
ఇదొక్కటే కాదు.. సోషల్ మీడియాలో ఇలాంటి బిల్లులు చాలానే హల్చల్ చేస్తున్నాయి. మంగళూరులోని ఓ వైన్ షాపులో రూ.59.952 మద్యం కొనుగోలు చేసినట్టుగా ఓ బిల్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. దాదాపు 46 రోజుల తర్వాత వైన్ షాపులు తెరుచుకోవడంతో చాలామంది మందు బాబులకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆంధ్రప్రదేశ్లో అయితే రేట్లు పెంచినా సరే.. దాని ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. కి.మీ మేర లైన్లలో నిలుచుని మరీ ఓపిగ్గా మద్యం కొనుగోలు చేస్తున్నారు.