మోడీపై బాంబు: ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్: పెద్దన్నయ్య మాటలు వింటోన్నాడు: తాజా సాక్ష్యం
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల తరఫున పోటీ చేస్తోన్న మార్గరెట్ అల్వా.. బాంబు పేల్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకున్నారు. ఆయననుు పెద్దన్నయ్య అంటూ సంబోధించారు. పెద్దన్నయ్య ప్రతిపక్ష నాయకుల మాటలు వింటోన్నాడని ధ్వజమెత్తారు. తన మొబైల్ ఫోన్ ట్యాపింగ్కు గురైందని స్పష్టం చేశారు. తాను ఎవరెవరితో మాట్లాడుతున్నాననే విషయాన్ని పెద్దన్నయ్య నరేంద్ర మోడీ వినడం వల్లే- తన మొబైల్ ఫోన్ బ్లాక్ అయిందని స్పష్టం చేశారు.
సిమ్ కార్డ్ బ్లాక్ చేస్తామంటూ..
అంతుముందు- మార్గరెట్ అల్వాకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పని చేస్తోన్న మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్) ఆమె ఫోన్ కనెక్షన్ను కట్ చేసింది. కనెక్షన్ను తొలగించినట్లు మార్గరెట్ అల్వాకు నోటీసులను పంపించింది. కేవైసీని సస్పెండ్ చేసినట్లు తెలిపింది. 24 గంటల వ్యవధిలో సిమ్ కార్డ్ను బ్లాక్ చేస్తామనీ స్పష్టం చేసింది.
ఇంకోసారి అలా చేయనంటూ..చురకలు
దీనితో ఆమె ఇబ్బందులకు గురయ్యారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రచార కార్యక్రమాలను చేపట్టాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో తనకు ఎలాంటి ఫోన్లు రావట్లేదని, తాను ఔట్ గోయింగ్ కాల్స్ చేయలేకపోతున్నానని చెప్పారు. ఇకపై తాను భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్కు చెందిన పార్లమెంట్ సభ్యులతో మాట్లాడబోనని, తన మొబైల్ కనెక్షన్ను పునరుద్ధరించాలని ఆమె ఎంటీఎన్ఎల్ అధికారులకు మార్గరెట్ అల్వా విజ్ఞప్తి చేశారు.
బీజేపీ ఎంపీలతో..
ప్రతిపక్షాల తరఫున ఉప రాష్ట్రపతి ఎన్నికల రేసులో మార్గరెట్ అల్వా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తన ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. తనకు పరిచయం ఉన్న కొందరు బీజేపీ ఎంపీలతో ఫోన్లో మాట్లాడారు. తనకు మద్దతు ఇవ్వని ప్రతిపక్ష పార్టీ తృణమూల్ కాంగ్రెస్, తటస్థంగా ఉంటోన్న బిజూ జనతాదళ్ ఎంపీలతోనూ ఆమె తరచూ ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీలకు అతీతంగా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలని, తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తోన్నారు.
న్యూ ఇండియా..
తాను బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ పార్టీలకు చెందిన ఎంపీలతో ఫోన్లో మాట్లాడుతున్నాననే విషయం కేంద్ర ప్రభుత్వానికి ఎలా తెలిసిందని మార్గరెట్ అల్వా ప్రశ్నించారు. పెద్దన్నయ్య (మోడీ) ప్రతిపక్ష నాయకులను ప్రతిక్షణం గమనిస్తూనే ఉన్నారని, వారు ఏం మాట్లాడతారనేది వింటుంటారని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ చెబుతోన్న న్యూ ఇండియా అంటే ఇదేనని చురకలు అంటించారు. ఎంపీలు, రాజకీయ పార్టీల నాయకుల ఫోన్లు ట్యాపింగ్కు గురవుతున్నాయని, తరచూ ఫోన్ నంబర్లను మార్చుకోవాల్సి వస్తోందని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్పై..
ఈ పరిస్థితుల మధ్య ఆమె వినియోగించే ఎంటీఎన్ఎల్ ఫోన్ కనెక్షన్ కట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయ రంగు పులుముకొంది. ఉన్నట్టుండి ఆమె సిమ్కార్డ్ను ఎందుకు బ్లాక్ చేయాల్సి వచ్చిందంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తోన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తోన్న ప్రతిపక్షాల అభ్యర్థిపై కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడిందని, కనీసం ఫోన్ వినియోగించే సౌకర్యం కూడా లేకుండా చేస్తోందని మండిపడ్డారు.