Kendriya Vidyalaya : మోడీ సర్కార్ భారీ ఝలక్- కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా రద్దు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన అత్యుత్తమ విద్యాసంస్ధల్లో ఒకటైన కేంద్రీయ విద్యాలయాల్లో కేటాయించే సీట్లపై కేంద్రం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధులకు ఇచ్చే సీట్లలో ఇప్పటివరకూ అమల్లో ఉన్న ఎంపీ కోటాను తొలగిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై ఎంపీల సిఫార్సులతో ఈ సీట్లు తీసుకోవడం వీలు కాదు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి వేల సంఖ్యలో కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్ధలు ఉన్న ప్రతీ చోటా ఆయా సంస్ధల్లో పనిచేసే ఉద్యోగుల పిల్లలు చదువుకునేందుకు వీలుగా కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం గతంలో అనుమతి ఇచ్చింది. అయితే వీటిలో సీట్లు పూర్తిగా భర్తీ కాకపోవడంతో ఇతరులకు కూడా అవకాశం కల్పించేందుకు స్ధానిక ఎంపీల సిఫార్సు లేఖల్ని అనుమతించేది. లోక్ సభ ఎంపీకయితే తన నియోజకవర్గం పరిధిలో పది కేంద్రీయ విద్యాలయ సీట్ల వరకూ సిఫార్సు చేసే అవకాశం ఉండేది. రాజ్యసభ ఎంపీకి అయితే తాను ఎన్నికైన రాష్ట్రంలోని కేంద్రీయ విద్యాలయాల్లో పది సీట్ల వరకూ సిఫార్సు చేసుకునేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు కేంద్రం ఈ కోటాను ఎత్తేయడంతో ఎంపీలకు ఎదురుదెబ్బ తగిలిగినట్లయింది.
కేంద్రీయ విద్యాలయాల్లో తమకు ఇస్తున్న పది సీట్ల కోటాను పెంచాల్సిందిగా ఎంపీలు ఎప్పటినుంచో కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే కేంద్రం దీన్ని వాయిదా వేస్తూ వస్తోంది. వీటిపై పార్లెమంటు సమావేశాలు జరిగినప్పుడల్లా ఎంపీల నుంచి కేంద్రమంత్రుల నుంచి తీవ్ర ఒత్తిడి కూడా ఉంటోంది. దీంతో అసలు ఈ చికాకు అంతా ఎందుకని అనుకున్నారో ఏమో కేంద్రంలో పెద్దలు మొత్తంగా ఎంపీల కోటానే ఎత్తేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇకపై అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రీయ విద్యాలయాల్లో సీట్లు మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగానే భర్తీ కానున్నాయి.