దేశంలో కరోనా సరికొత్త మహోత్పాతం: ఒక్కరోజే లక్షకు చేరువగా: ఏపీ సహా 5 రాష్ట్రాల్లో కల్లోలం
న్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ సరికొత్త మహోత్పాతాన్ని సృష్టిస్తోంది. కళ్లు బైర్లు రేంజ్లో రోజువారీ కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. లక్ష మార్క్కు చేరువ అయ్యాయి. ఇదివరకెప్పుడూ లేనివిధంగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. పాత రికార్డులను బద్దలు కొట్టాయి. ఇప్పటికే కరోనా వైరస్ కేసుల్లో ప్రపంచంలోనే రెండో స్థానాన్ని ఆక్రమించింది భారత్. ఇప్పుడున్న వేగం.. దూకుడు ఇదే స్థాయిలో కొనసాగితే అగ్రస్థానానికి దూసుకెళ్లడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు.
తెలంగాణలో లక్షన్నర మార్క్: వెల్లువలా వైరస్: టెస్టింగుల్లో సర్కార్ దూకుడు
95 వేలకు పైగా
దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 95,735 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1172 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 44,65,864కు చేరుకుంది. ఇప్పటిదాకా 75,062 మంది మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 9,19,018కి చేరుకుంది. 34,71,784 మంది డిశ్చార్జి అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన తాజా బులెటిన్ను కొద్దిసేపటి కిందటే కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేశారు. మరణాల్లోనూ ఉధృతి కొనసాగుతోంది. వరుసగా మూడోరోజు 1100 మందికి పైగా మరణించారు.
కరోనా కేసుల్లో రెండోస్థానంలో..
కరోనా మరణాల్లో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో కొనసాగుతోంది. 75,062 మంది ఇప్పటిదాకా మరణించారు. అమెరికా, బ్రెజిల్ తరువాత అత్యధిక మరణాలు నమోదైనది భారత్లోనే. అమెరికాలో 1,95,239, బ్రెజిల్లో 1,28,653 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. భారత్లో ఇదివరకు వెయ్యికి లోపే కరోనా మరణాలు నమోదువుతోండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 1100లను దాటుకుంది. మరింత పెరుగుతోంది. కరోనా మరణాల్లో మెక్సికో నాలుగో స్థానంలో ఉంది. మెక్సికోలో కరోనా వల్ల 69,095 మంది మృత్యువాత పడ్డారు.
ఏపీ సహా పలు రాష్ట్రాల్లో..
ఏపీ సహా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్లల్లో కరోనా పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. బుధవారం నాడు వెలువడిన బులెటిన్ ప్రకారం.. ఏపీలో 10,418 కేసులు నమోదు అయ్యాయి. 74 మంది మరణించారు. రెండువారాల నుంచీ 10 వేలకు పైగా రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి ఏపీలో. మొత్తం కేసుల సంఖ్య 5,27,512కు చేరుకుంది. ఇందులో 4,25,607 మంది డిశ్చార్జి అయ్యారు. 97,271 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇదే పరిస్థితి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుల్లో కొనసాగుతోంది. దీని ప్రభావం జాతీయ గణాంకాలపై పడుతున్నాయి.
Recommended Video
జోరుగా టెస్టింగులు..
రాష్ట్రాల్లో అనూహ్య సంఖ్యలో పుట్టుకొస్తోన్న కొత్త కేసుల వల్ల దేశవ్యాప్తంగా లక్ష వరకు రోజువారీ లెక్కలు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా వైరస్ పరీక్షలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైనప్పటి నుంచి సోమవారం వరకూ నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య అయిదు కోట్ల మార్క్ను అధిగమించింది. ఇప్పటిదాకా 5,29,34,433 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజులో 11,29,756 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.