దుర్గమ్మ విగ్రహాల నిమజ్జనంలో ఘర్షణ: పోలీసుల కాల్పులు: దూసుకెళ్లిన బుల్లెట్లు: ఒకరి మృతి
పాట్నా: తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కొన్ని గంటల ముందు బిహార్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. దుర్గమ్మ అమ్మవారి విగ్రహాల నిమజ్జన ఘట్టంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించారు. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘర్షణలో 20 మందికి పైగా పోలీసులకూ గాయాలు అయ్యాయి. నిబంధనలను ఉల్లంఘించి పెద్ద సంఖ్యలో స్థానికులు ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడమే ఈ ఘర్షణకు దారి తీసినట్లు తెలుస్తోంది.

మూడు రోజుల తరువాత విగ్రహాల నిమజ్జనానికి నో..
బిహార్లోని ముంగేర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ముంగేర్లో స్థానికులు పెద్ద ఎత్తున దుర్గమ్మ అమ్మవారి మండపాలను నెలకొల్పారు. ముంగేర్ టౌన్ పరిధిలోనే 53 మండపాలను స్థానికులు ఏర్పాటు చేసుకున్నారు. వాటన్నింటికీ పోలీసుల అనుమతి ఉంది. విజయదశమి వేడుకలు ముగిసిన అనంతరం అమ్మవారి విగ్రహాలను నిమజ్జనానికి తీసుకెళ్లారు. బిహారీల సంప్రదాయం ప్రకారం.. విజయదశమి ముగిసిన మూడురోజులకు విగ్రహాలను నిమజ్జనం చేయాల్సి ఉంది.

ఎన్నికల వల్ల దసరా మరుసటి రోజే..
మూడో రోజు నాటికి తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆరంభం కానుండటంతో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. విజయదశమి మరుసటిరోజే, సాయంత్రం 5 గంటల్లోపే నిమజ్జనం చేయాాల్సి ఉంటుందని ఆదేశించారు. దీనికి అనుగుణంగా స్థానికులు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ముంగేర్ పట్టణానికి ఆనుకుని ప్రవహిస్తోన్న గంగానదిలో వాటిని నిమజ్జనం చేయాల్సి ఉంది. 53 విగ్రహాల్లో 15 విగ్రహాలను దీన్ దయాళ్ చౌక్ సమీపంలోని ఘాట్ వద్ద గంగానది వద్దకు తరలించే సమయంలో భక్తులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని పోలీసులు చెబుతున్నారు.

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఊరేగింపు..
అర్ధరాత్రి దాటినప్పటికీ.. ఊరేగింపును నిర్వహించడం, డీజేను ప్లే చేయడం వంటి చర్యలకు దిగారని, వారిన వారించడానికి పోలీసులు ప్రయత్నించడంతో ఘర్షణ తలెత్తినట్లు చెబుతున్నారు. విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్తోన్న వాహనాలతో పాటు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, వారిపై కేసు నమోదు చేయడంతో స్థానికుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. వారు పోలీసులతో వాగ్వివాదానికి దిగారని, అది కాస్తా చిలికి చిలికి గాలీవానగా మారిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

పోలీసులకూ గాయాలు..
వాగ్వివాదానికి దిగిన వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దీనితో మరింత రెచ్చిపోయిన స్థానికులు పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. చేతికి అందిన వస్తవులను విసిరేశారు. 20 మందికి పైగా పోలీసులకు గాయాలయ్యాయి. పెద్ద సంఖ్యలో గుమికూడిన స్థానికులను చెదరగొట్టడానికి లాఠీ ఛార్జీ జరిపినప్పటికీ.. ఫలితం లేకపోవడంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించారు. ఏడుమందికి బుల్లెట్ గాయాలయ్యాయి. మరో 27 మంది గాయపడ్డారు.

ఉద్రిక్త వాతావరణం..
గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఏడుమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం భాగల్పూర్ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ముంగేర్ సదర్ ఆసుపత్రి డాక్టర్ నిరంజన్ తెలిపారు. స్థానికులు జరిపిన రాళ్లదాడిలో 20 మందికి పైగా పోలీసులకు గాయాలయ్యాయని సమాచారం. వారంతా సంగ్రామ్పూర్, కొత్వాలి, ఖాసిం బజార్, బాసుదేవ్పూర్ పోలీస్ స్టేషన్లకు చెందిన కానిస్టేబుళ్లని అధికారులు తెలిపారు. మంగళవారం తెల్లవారు జామున 3 గంటల వరకు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగినట్లు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే ముంగేర్ జిల్లా కలెక్టర్ రాజేష్ మినా, ఎస్పీ లిపి సింగ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications