వైఎస్ జగన్ బాటలో నితీష్ కుమార్: ఉప ముఖ్యమంత్రుల సంఖ్య పెంపు? మహా మాజీ సీఎం ప్రత్యక్షం
పాట్నా: బిహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు ఆరంభం అయ్యాయి. జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీలతో కూడిన ఎన్డీఏ.. మరోసారి అధికారాన్ని అందుకోబోతోంది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సభా పక్ష నేతను ఎన్నుకోవడానికి ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఉమ్మడిగా భేటీ కానున్నారు. రాజధాని పాట్నాలోని నితీష్ కుమార్ నివాసంలో ఆ సమావేశం ఇంకాస్సేపట్లో ఆరంభం కానుంది. ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులను ఈ భేటీలో ఖరారు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
రాజ్నాథ్ సింగ్..
ఈ సమావేశానికి రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఆయనతో పాటు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సహా కొందరు ఎన్డీఏ నేతలు ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. నామమాత్రపు మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చినందున.. మున్ముందు ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుందనే విషయంపై వారు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ఎన్డీఏ మిత్రపక్షాలు వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ, హిందుస్తానీ ఆవామ్ మోర్చాలకు కేటాయించాల్సిన పదవులపై చర్చిస్తారు.
ఉప ముఖ్యమంత్రుల సంఖ్య పెంపు..
కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఎన్డీఏ నేతలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానాలను అనుసరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రుల సంఖ్యను పెంచే అంశాన్ని పరిశీలిస్తారని అంటున్నారు. నితీష్ కుమార్ కేబినెట్లో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను తీసుకోవచ్చని అంటున్నారు. జేడీయు తరఫున ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పగ్గాలను అందుకోవడం ఖాయం. బీజేపీ-వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ-హిందుస్తానీ ఆవామ్ మోర్చాలకు ఉప ముఖ్యమంత్రి పదవులను కేటాయిస్తారనే ప్రచారం రాజధాని పాట్నాలో సాగుతోంది.
సుశీల్ కుమార్ మోడీ కొనసాగింపుపైనా
బిజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు ఒకసారి అవకాశం ఇచ్చినందున.. ఈ సారి మరో సీనియర్ నేతకు ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. సుశీల్ కుమార్ మోడీకి కీలకమైన శాఖను అప్పగించడం ద్వారా ఆయనను బుజ్జగిస్తారని తెలుస్తోంది. అలాగే- వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ, హిందుస్తానీ ఆవామ్ మోర్చాలకు కేబినెట్లో చోటు కల్పించడం దాదాపు ఖాయమైనట్టే. ప్రస్తుతం ఆ రెండు పార్టీల మద్దతుతోనే ఎన్డీఏ బిహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.
మహారాష్ట్ర ఫార్ములా
ఉప ముఖ్యమంత్రుల సంఖ్యను పెంచే విషయంలో ఏపీని, కొత్త మంత్రివర్గం ఏర్పాటులో మహారాష్ట్ర ఫార్ములాను ఎన్డీఏ అనుసరించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్రలో శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్తో కూడిన మహా వికాస్ అఘాడీ కూటమి ఏరకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో.. దాదాపు అదే ఫార్ములాను ఆధారంగా బిహార్లో మంత్రివర్గ కూర్పు ఉంటుందని, ఈ వ్యవహారంలో దేవేంద్ర ఫడ్నవిస్ సూచలను తీసుకుంటారని అంటున్నారు. అందుకే- ఆయనను పిలిపించినట్లు తెలుస్తోంది.
Recommended Video
ఆ రెండు పార్టీలే కీలకం..
243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 122 స్థానాలు అవసరం అవుతాయి. దీనికంటే మూడంటే మూడు సీట్లను మాత్రమే జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతాపార్టీ సంకీర్ణ కూటమి దక్కించుకోగలిగింది. మొన్నటి ఎన్నికల్లో జేడీయూ-115, భారతీయ జనతా పార్టీ-110, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ-11, జీతన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ ఆవామ్ మోర్చా-7 స్థానాలకు పోటీ చేశాయి. ఇందులో బీజేపీ-74, జేడీయూ-43 సీట్లల్లో గెలుపొందాయి. ఈ రెండు పార్టీలకు దక్కిన స్థానాలు 117. ఎన్డీఏతో పొత్తు కుదుర్చుకున్న హిందుస్తాన్ ఆవామీ మోర్చా, వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ నాలుగు చొప్పున స్థానాలను గెలుచుకున్నాయి. ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో ఎన్డీఏ సంఖ్య 225కు చేరుకుంది. అందుకే- మంత్రివర్గంలో ఈ రెండు పార్టీలకూ కీలక శాఖలను అప్పగిస్తారని అంటున్నారు.