ఈ రాత్రి గడిస్తే చాలు: పారామిలటరీ బలగాల పహారాలో బిహార్: ఎగ్జిట్ పోల్స్ హీట్
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఇంకొన్ని గంటల్లో ఆరంభం కాబోతోంది. మంగళవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం.. ప్రస్తుతం అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో పడినట్టే. ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రీయ జనతా దళ్ ఈ సారి గద్దెనెక్కడానికి అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వెలువడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ రాత్రి గడిస్తే చాలనే పరిస్థితులు క్రమంగా నెలకొంటున్నాయి.
బిహార్లోని సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో కౌంటింగ్ సందర్భంగా లేదా ఆ తరువాత ఘర్షణలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉండే ప్రమాదం ఉందని భావించిన కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు, పారామిలటరీ దళాలను మోహరింపజేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద పోలీసు గస్తీని మరింత పెంచారు. దీనికోసం అదనంగా 19 పారా మిలటరీ దళాలను రప్పించినట్లు బిహార్ ఎన్నికల ప్రధాన అధికారి హెచ్ఆర్ శ్రీనివాస తెలిపారు.
సేవ్ మన్సాస్ ఉద్యమం గరంగరం: సంచైత ఏమంటున్నారు? అశోక్ గజపతి రాజు కేరీర్ కోసం: అసలు రంగు
స్ట్రాంగ్ రూమూలు, పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని అన్నారు. ఇప్పటిదాకా 59 కంపెనీల పారామిలటరీ బలగాలను బిహార్ వ్యాప్తంగా మోహరింపజేశామని చెప్పారు. వారికి అదనంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్), బిహార్ మిలటరీ పోలీస్ (బీఎంపీ)ల సహకారాన్ని తాము తీసుకుంటున్నామని అన్నారు. సాధారణ పోలీసులకు అదనంగా వారంతా విధి నిర్వహణలో ఉంటారని చెప్పారు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాలతో పాటు స్ట్రాంగ్ రూమ్ల వద్ద 144 సెక్షన్ను విధించామని అన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఓట్ల లెక్కింపు కేంద్రాల సంఖ్యను పెంచామని తెలిపారు. ఉద్యోగులు భౌతిక దూరాన్ని పాటించాల్సి రావడం వల్ల ఇదివరకు ప్రతిపాదించిన కేంద్రాల్లో స్థలాభావ సమస్య తలెత్తిందని, ఫలితంగా వాటి సంఖ్యను పెంచామని అన్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో తాము 38 పోలింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చామని, కరోనా పరిస్థితుల వల్ల ఈ సంఖ్యను 55కు పెంచినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలను తీసుకున్నామని అన్నారు.