అగ్ర కులాలవాళ్లంతా విదేశీయులే: బీహార్ సిఎం మంఝీ
"అగ్ర కులాల ప్రజలు విదేశీయులు, ఆర్యజాతికి చెందిన వలసవచ్చినవారు.. వారు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చారు" అని మంఝీ అన్నారు. మంగళవారం రాత్రి బెట్టయ్యలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. గిరిజనులు, దళితులు మాత్రమే స్వదేశీయులని అన్నారు. వారు చైతన్యవంతులై రాజకీయ చైతన్యాన్ని సంతరించుకుని బలహీనవర్గాలు బీహార్ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర వహించేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.
బీహార్లో ముఖ్యమంత్రి మంఝీ కుల ఉద్రిక్తతలకు తావు కల్పిస్తున్నారని బిజెపి సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ విమర్శించారు. అగ్రకులాల జాతీయతను ప్రశ్నించడం ద్వారా వివిధ వర్గాల మధ్య మంఝీ గోడ కడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
సామాజిక పునాదిపై ప్రజలను విడదీయడానికి మంఝీ ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదని, మధుబని జిల్లాలోని ఆలయంలో తన పట్ల వివక్ష ప్రదర్శించారని మంఝీ ఆరోపించారని ఆయన గుర్తు చేశారు. తాను వచ్చిన వెళ్లిన తర్వాత ఆలయాన్ని పరిశుభ్రం చేశారని మంఝీ అన్నారని, అది ఇప్పటి వరకు నిరూపితం కాలేదని ఆయన అన్నారు.
ఆ సంఘటనపై మంఝీయే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారని, అధికారులు దానిపై నివేదిక సమర్పించాల్సి ఉందని, ముఖ్యమంత్రి చౌకబారు ప్రచారాన్ని కోరుకుంటున్నారని ఆయన అన్నారు.