భర్త వెళ్తే: స్త్రీలపై బీహార్ సీఎం తీవ్ర వ్యాఖ్య, పార్టీ చివాట్లు
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేసి సొంత పార్టీ అధిష్ఠానం నుంచి కూడా చీవాట్లు పెట్టించుకున్నారు. పెళ్లి తర్వాత భర్తలు ఏళ్ల తరబడి బయటే ఉంటే, వారి భార్యలు ఏం చేస్తుంటారనే విషయం అందరికీ తెలుసునన్నారు. వారి నైతికతను ఆయన ప్రశ్నించారు.
బీహార్లోని గోపాల్గంజ్ జిల్లా జాజ్వా పక్డీ గ్రామంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాంఝీ ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మాంఝీ వ్యాఖ్యలపై జేడీయూ కూడా తీవ్రంగానే స్పందించింది. మాజీ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ రాష్ట్ర అభివృద్దిని ముందుకు తీసుకెళ్లేందుకే మాంఝీని ముఖ్యమంత్రి చేశామని, ఆయననేమీ భారత చరిత్రను తిరగరాయమని చెప్పలేదని ఘాటుగా వ్యాఖ్యానించింది.
అది ఆయన పని కూడా కాదని చెప్పింది. మాంఝీ వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్ఠను మంటగలుపుతున్నాయని మండిపడింది. తన అనుచిత వ్యాఖ్యలతో మాంఝీ హద్దులు దాటుతున్నారని ధ్వజమెత్తింది. ఆయన తన వైఖరి మార్చుకోకపోతే మాంఝీపై చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడమని పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ త్యాగి హెచ్చరించారు.
మరోవైపు, అగ్రకులాల వారంతా విదేశీయులన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మాంఝీ గురువారం చెప్పారు. తాను తప్పుగా ఏమీ వ్యాఖ్యానించలేదన్నారు.
కాగా, రామ్ మంఝీ మూడు రోజుల క్రితం వివాదాస్పద ప్రకటన చేశారు. అగ్రకులాల ప్రజలంతా విదేశీయూలని, వలస వచ్చిన ఆర్య జాతికి చెందినవారన్నారు. ఆయన ప్రకటనపై బిజెపి తీవ్రంగా మండిపడింది. కుల ఉద్రిక్తతలకు మాంఝీ పురుడు పోస్తున్నారని ఆరోపించింది.
"అగ్ర కులాల ప్రజలు విదేశీయులు, ఆర్యజాతికి చెందిన వలసవచ్చినవారు.. వారు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చారు" అని మంఝీ అన్నారు. మంగళవారం రాత్రి బెట్టయ్యలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. గిరిజనులు, దళితులు మాత్రమే స్వదేశీయులని అన్నారు. వారు చైతన్యవంతులై రాజకీయ చైతన్యాన్ని సంతరించుకుని బలహీనవర్గాలు బీహార్ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర వహించేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.
బీహార్లో ముఖ్యమంత్రి మాంఝీ కుల ఉద్రిక్తతలకు తావు కల్పిస్తున్నారని బిజెపి సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ విమర్శించారు. అగ్రకులాల జాతీయతను ప్రశ్నించడం ద్వారా వివిధ వర్గాల మధ్య మాంఝీ గోడ కడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సామాజిక పునాదిపై ప్రజలను విడదీయడానికి మాంఝీ ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదని, మధుబని జిల్లాలోని ఆలయంలో తన పట్ల వివక్ష ప్రదర్శించారని మాంఝీ ఆరోపించారని ఆయన గుర్తు చేశారు.
తాను వచ్చిన వెళ్లిన తర్వాత ఆలయాన్ని పరిశుభ్రం చేశారని మాంఝీ అన్నారని, అది ఇప్పటి వరకు నిరూపితం కాలేదని ఆయన అన్నారు. ఆ సంఘటనపై మాంఝీయే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారని, అధికారులు దానిపై నివేదిక సమర్పించాల్సి ఉందని, ముఖ్యమంత్రి చౌకబారు ప్రచారాన్ని కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
కోర్టుకు..
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాంఝిపై రెండు కోర్టు కేసులు నమోదయ్యాయి. పురాణీ గుడ్రిలో సంజయ్ కుమార్ మిశ్రా అనే వ్యక్తి చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసుపై కోర్టు డిసెంబర్ 10న విచారణ చేపట్టనుంది. మరో కేసు సమస్తిపూర్ జిల్లాలోని రొశెరాలో విజయ్ మిశ్రా అనే వ్యక్తి సీఎంపై కేసు వేశారు.